పక్కాగా శివరాత్రి ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 08 , 2026 | 01:00 AM
మహాశివరాత్రికి బలిఘట్టం ఉత్తరవాహినికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. శనివారం బలిఘట్టం ఉత్తరవాహిని ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ తేదీ రాత్రంతా భక్తులు జాగారం ఉండి 16న తెల్లవారు జామున ఉత్తరవాహినిలో స్నానాలు చేయడానికి వస్తారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధికంగా వస్తారని, పుణ్య స్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
- అధికారులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశం
- బలిఘట్టం ఉత్తరవాహిని సందర్శన
నర్సీపట్నం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రికి బలిఘట్టం ఉత్తరవాహినికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖల అధికారులను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదేశించారు. శనివారం బలిఘట్టం ఉత్తరవాహిని ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ తేదీ రాత్రంతా భక్తులు జాగారం ఉండి 16న తెల్లవారు జామున ఉత్తరవాహినిలో స్నానాలు చేయడానికి వస్తారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు అధికంగా వస్తారని, పుణ్య స్నానాలు చేసిన తర్వాత దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ అక్షయపాత్ర తరఫున భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అగ్నిమాపక కేంద్రం పక్కన, బలిఘట్టం పాత పంచాయతీ పక్కన ఉన్న రోడ్లకు ఇరువైపులా విద్యుత్ స్తంభాలకు లైట్లు ఏర్పాటు చేయాలని కమిషనర్ సురేంద్రను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ డీఈ, ఏఈలకు సూచించారు. ట్రాఫిక్, వాహనాలు పార్కింగ్ సమస్య లేకుండా చూడాలని సీఐ గఫూర్ను ఆదేశించారు. అగ్నిమాపక వాహనం, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. నదిలో ప్రస్తుతం ఉన్న నీరు విడిచి పెట్టి, శివరాత్రికి రెండు రోజుల ముందు రావణాపల్లి కొత్త నీటిని విడుదల చేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీ సాయత్రం ఉత్తరవాహిని వద్ద అన్నవరం దేవస్థానం వేద పండితుల ఆధ్వర్యంలో గంగాహారతి నిర్వహిస్తున్నామని తెలిపారు. 16వ తేదీన వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని బలిఘట్టం అర్బన్ పీహెచ్సీ వైద్యాధికారిని ఆదేశించారు. అవసరమైన సిబ్బందిని, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అధికారులు సమన్వయం చేసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వీవీ రమణ, కమిషనర్ సురేంద్ర, తహశీల్దార్ రామారావు, సీఐ గఫూర్, ఏఎంసీ చైర్మన్ రమణ పాల్గొన్నారు.
రూ.22 కోట్లతో రహదారుల అభివృద్ధి
నియోజవర్గంలో రూ.22 కోట్లతో 29 రహదారులను అభివృద్ధి చేస్తున్నామని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పంచాయతీరాజ్ శాఖా మంత్రి పవన్ కల్యాణ్ చొరవతో రాష్ట్రంలో 1,392 రహదారులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. నాబార్డ్, ఎస్ఏఎస్సీఐ నిధులతో పనులు చేపడతున్నామన్నారు. ఇందులో నర్సీపట్నం నియోజకవర్గం మీద ప్రత్యేక అభిమానంతో 29 రహదారుల అభివృద్ధికి రూ.22 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. ఈ నిధులతో మాకవరపాలెంలో రూ.4.21 కోట్లతో 4 రోడ్లు, నాతవరం మండలంలో రూ.8.12 కోట్లతో 7, గొలుగొండ మండలంలో రూ.6.3 కోట్లతో 12, నర్సీపట్నం మండలంలో రూ.3.37 కోట్లతో 4 రోడ్లు అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. ఈ పనులకు టెండర్ల ప్రక్రియ 15 రోజుల్లో పూర్తవుతుందని తెలిపారు. రహదారుల నిర్మాణ పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా ఆయా మండల నాయకులు దగ్గరుండి చూసుకోవాలని సూచించారు.