పనస రైతుకు కాసులు
ABN , Publish Date - Mar 20 , 2026 | 11:21 PM
పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరిజన ప్రాంతంలో లభించే పనస కాయలకు డిమాండ్ ఏర్పడింది.
సైజ్ బట్టి రేటు
రూ.50 నుంచి రూ.100కు
కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
మైదాన ప్రాంతంలో డిమాండ్
కొయ్యూరు, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పెళ్లిళ్ల సీజన్ కావడంతో గిరిజన ప్రాంతంలో లభించే పనస కాయలకు డిమాండ్ ఏర్పడింది. కాయ సైజ్ బట్టి రూ.50 నుంచి రూ.100 వరకు ధర పలుకుతోంది. దీంతో గిరిజనులు అడవి బాట పట్టి పనస కాయల సేకరణలో నిమగ్నమయ్యారు. పాడేరు మన్యానికి మైదాన ప్రాంతంతోపాటు ఒడిశా, ముంబై, కోల్కతా వంటి దూర ప్రాంత వ్యాపారులు నేరుగా గ్రామాలకు వాహనాలతో వచ్చి పనస కాయలు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు నుంచి ఆరు కిలోల బరువు ఉన్న పనస కాయలను కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకొస్తున్నారు. పొలాలు, కల్లాలు, అటవీ ప్రాంతంల్లోని పనస చెట్లు కాపు ఆశాజనకంగా ఉండడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పనసపొట్టు కూరకు మైదాన ప్రాంతంలో ఆదరణ ఉంది. అయితే ఏజెన్సీలో కొన్ని మండలాలలో పనస కాపు తగ్గింది. దీంతో ప్రస్తుతం పనస పిందెలకు ధర పలుకున్నదని పలువురు అంటున్నారు.