ఆర్టీసీ కాంప్లెక్స్ కిటకిట
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:02 AM
స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ సర్వీసుల ప్లాట్ ఫారాలు కిటకిటలాడాయి. విశాఖపట్నం, విజయనగరంతోపాటు అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం అధిక సమయం నిరీక్షించాల్సి వచ్చింది.
శుభకార్యాలు అధికంగా ఉండడంతో ప్రయాణికుల రద్దీ
బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షణ
అనకాపల్లి టౌన్, జూలై 5 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ప్రయాణికులతో రద్దీగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్యాసింజర్, ఎక్స్ప్రెస్ సర్వీసుల ప్లాట్ ఫారాలు కిటకిటలాడాయి. విశాఖపట్నం, విజయనగరంతోపాటు అనకాపల్లి జిల్లాలో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం అధిక సమయం నిరీక్షించాల్సి వచ్చింది. ఆదివారం శుభకార్యాలు ఎక్కువ వుండడంతో ఈ కార్యక్రమాలకు హాజరు కావడానికి వెళ్లే ప్రయాణికులతో కాంప్లెక్స్ రద్దీగా మారింది. బస్సుల కోసం ఎక్కువ సేపు వేచివుండాల్సి రావడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ప్లాట్ఫారం వద్దకు బస్సు రావడమే తరువాయి.. ఒక్కసారిగా తోసుకుంటూ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలు వుండడం గమనార్హం. ఎలమంచిలి, విశాఖపట్నం, పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, దేవరాపల్లి, మాడుగుల ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సులో కూర్చొని ఎంత మంది ప్రయాణించారో.. అంతకన్నా ఎక్కువ మంది నిల్చుని ప్రయాణించారు. ఉదయం నుంచి రాత్రి ఏడు గంటల వరకు ఇదే పరిస్థితి నెలకొంది. స్త్రీశక్తి పథకాన్ని అమలు చేసిన తరువాత మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఇందుకు అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచకపోవడంతో మహిళలతోపాటు ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు తప్పలేదు.