ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
ABN , Publish Date - Aug 02 , 2026 | 11:36 PM
ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనచోదకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎలమంచిలి - గాజువాక ప్రధాన మార్గంలోని పరవాడ పైడిమాంబ ఆలయ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది.
పరవాడ పైడిమాంబ ఆలయ సమీపంలో ఘటన
పరవాడ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనచోదకుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎలమంచిలి - గాజువాక ప్రధాన మార్గంలోని పరవాడ పైడిమాంబ ఆలయ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగింది. దీనికి సంబంధించి పరవాడ సీఐ ఎల్. భాస్కరరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో ఈ.మర్రిపాలెం గ్రామానికి చెందిన తోకాడ దుర్గారావు (32) ఏపీ ఈపీడీసీఎల్లో కాంట్రాక్టు పద్ధతిలో అసిస్టెంట్ లైన్మన్గా లంకెలపాలెం సెక్షన్ పరిధిలో పనిచేస్తున్నాడు. ఆదివారం సొంత పని నిమిత్తం స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై అచ్యుతాపురం వెళ్లాడు. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా పరవాడ పైడిమాంబ ఆలయ సమీపంలోకి వచ్చేసరికి అదే రహదారిలో ఎదురుగా ప్రయాణికులతో ఎలమంచిలి వెళుతున్న గాజువాక డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయానికి తరలించారు. మృతునికి భార్య భాగ్యశ్రీ, కుమారులు మోక్షిత్, దీక్షిత్లు ఉన్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.