Share News

గంటసేపు అంధకారం

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:31 AM

పట్టణంలో శుక్రవారం రాత్రి గంటసేపు విద్యుత్‌ సరఫరా లేక అంధకారం అలుముకుంది. దీంతో రాత్రి 10.20 నుంచి 11.20 వరకు పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏపీ ఈపీడీసీఎల్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసినా స్పందించలేదని వాపోయారు.

గంటసేపు అంధకారం
శుక్రవారం రాత్రి చీకటిగా ఉన్న ఎలమంచిలి రోడ్డు

- విద్యుత్‌ సరఫరా లేక రాత్రి వేళ పట్టణ వాసుల అవస్థలు

ఎలమంచిలి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో శుక్రవారం రాత్రి గంటసేపు విద్యుత్‌ సరఫరా లేక అంధకారం అలుముకుంది. దీంతో రాత్రి 10.20 నుంచి 11.20 వరకు పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏపీ ఈపీడీసీఎల్‌ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేసినా స్పందించలేదని వాపోయారు. కాగా నర్సింగబిల్లి సబ్‌ స్టేషన్‌ నుంచి లైను కలపడంతో విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ అయింది. అసలే ఉక్కపోతతో అల్లాడిపోతున్న జనానికి శుక్రవారం రాత్రి గంటసేపు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో అవస్థలు పడ్డారు. పట్టణమంతా చీకట్లు కమ్ముకోవడంతో ఎప్పుడు విద్యుత్‌ సరఫరా వస్తుందో తెలియక ఆందోళన చెందారు. విద్యుత్‌ శాఖ అధికారులను సంప్రతించేందుకు ఫోన్‌ చేసినా స్పందించలేదు. అయితే ప్రయత్నించగా ఒక అధికారి మాత్రం ఎమర్జెన్సీ లోడ్‌ రిలీఫ్‌ అని చెప్పి ఫోన్‌ పెట్టేశారు. సిబ్బంది మాత్రం ఓవర్‌లోడ్‌ కారణంగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. గంటసేపు తరువాత నర్సింగబిల్లి సబ్‌స్టేషన్‌ నుంచి లైన్‌ కలిపి విద్యుత్‌ను పునరుద్ధరించడంతో జనం ఉపశమనం పొందారు.

Updated Date - Jun 28 , 2026 | 12:31 AM