Share News

జిల్లాకొక సమన్వయ అధికారి

ABN , Publish Date - Jul 16 , 2026 | 01:22 AM

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ జిల్లాకొక కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ (సమన్వయ అధికారి-డీసీఓ)ను నియమించింది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు డీసీఓలు నియమితులయ్యారు.

జిల్లాకొక  సమన్వయ అధికారి

వీఎంఆర్‌డీఏ నిర్ణయం

కారు, అటెండరు, డీఈఓ సదుపాయం

కోర్టు కేసుల కోసం

మరో సమన్వయ అధికారి

విశాఖపట్నం, జూలై 15 (ఆంధ్రజ్యోతి):

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ జిల్లాకొక కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌ (సమన్వయ అధికారి-డీసీఓ)ను నియమించింది. విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు డీసీఓలు నియమితులయ్యారు. వీరంతా రిటైర్డ్‌ డిప్యూటీ కలెక్టర్లు కావడం గమనార్హం. రిటైరైన వారిని తిరిగి ఉద్యోగం తీసుకోవాలంటే ప్రభుత్వానికి లేఖ రాసి, కమిటీ స్ర్కీనింగ్‌ జరిగి, సీఎం ఆమోదం లభించాకే తీసుకోవాలి. కానీ శాశ్వత ప్రాతిపదికన కాకుండా ఏడాది కాలానికి కాంట్రాక్టు పద్ధతిలో కావడంతో వీఎంఆర్‌డీఏ బోర్డులో చర్చించి తీసుకున్నారు. అనకాపల్లికి జవహర్‌లాల్‌ నెహ్రూ, విజయనగరానికి మహేశ్‌, విశాఖపట్నానికి హుస్సేన్‌ సాహెబ్‌లను తీసుకున్నారు. వీరు ఆయా జిల్లాల్లో వీఎంఆర్‌డీఏకి సంబంధించిన అన్ని విషయాలు చూసుకుంటారు. సమావేశాలకు హాజరవుతారు. విశాఖలో నిత్యం కలెక్టరేట్‌లో జరిగే సమావేశాలకు వీఎంఆర్‌డీఏ తరపున ఉన్నతాధికారి హాజరు కావాల్సి వస్తోంది. ఇకపై డీసీఓనే చాలా వరకు హాజరవుతారు. వారికి ఒక కారు, ఒక అటెండర్‌, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్‌ను ఇచ్చారు. అలాగే ఎస్టేట్‌ అధికారి కోర్టు కేసుల కోసం నిత్యం బయటే ఉంటున్నారు. దాంతో ఆ విభాగంలో పనులుజాప్యం అవుతున్నాయి. అందుకని అక్కడ లీగల్‌ కో-ఆర్డినేటింగ్‌ ఆఫీసర్‌గా గణపతిరావును నియమించారు. వీఎంఆర్‌డీఏకి ఇటీవల పని ఒత్తిడి బాగా పెరిగినందున బోర్డు మీటింగ్‌లో పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నామని కమిషనర్‌ తేజ్‌భరత్‌ తెలిపారు.

Updated Date - Jul 16 , 2026 | 01:22 AM