మునగపాక ఎంపీపీపై అవిశ్వాసం
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:18 AM
స్థానిక ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలపై అవిశ్వాసం ప్రకటిస్తూ పది మంది ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం ఎంపీడీవోకు, అనకాపల్లి ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలు వుండగా, గత ఎన్నికల్లో అన్నిచోట్లా వైసీపీ గెలుపొందింది. ఈ పార్టీకి చెందిన మునగపాక ఎంపీటీసీ-1 సభ్యురాలు మళ్ల జయలక్ష్మిని ఎంపీపీగా, చెర్లోపాలెం, నాగులాపల్లి-1 ఎంపీటీసీ సభ్యులు బోజా లక్ష్మి, చిందాడ దేవిలను వైస్ఎంపీపీలుగా ఎన్నుకున్నారు.
ఇద్దరు వైస్ ఎంపీపీలపైనా..
ఎంపీడీవో, ఆర్డీవోలకు నోటీసులు అందజేసిన ఎంపీటీసీ సభ్యులు
మునగపాక, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలపై అవిశ్వాసం ప్రకటిస్తూ పది మంది ఎంపీటీసీ సభ్యులు శుక్రవారం ఎంపీడీవోకు, అనకాపల్లి ఆర్డీఓకు వినతిపత్రం అందించారు. మండలంలో మొత్తం 16 ఎంపీటీసీ స్థానాలు వుండగా, గత ఎన్నికల్లో అన్నిచోట్లా వైసీపీ గెలుపొందింది. ఈ పార్టీకి చెందిన మునగపాక ఎంపీటీసీ-1 సభ్యురాలు మళ్ల జయలక్ష్మిని ఎంపీపీగా, చెర్లోపాలెం, నాగులాపల్లి-1 ఎంపీటీసీ సభ్యులు బోజా లక్ష్మి, చిందాడ దేవిలను వైస్ఎంపీపీలుగా ఎన్నుకున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎంపీపీ, వైస్ఎంపీపీలు ఎమ్మెల్యే విజయకుమార్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఎంపీపీ జయలక్ష్మి కొంతకాలం తరువాత తిరిగి వైసీపీ గూటికి చేరారు. కానీ మిగిలిన ఎంపీటీసీ సభ్యులు గుర్రుగా వున్నారు. ఎంపీపీ పదవికి రాజీనామా చేయాలని, అవిశ్వాస తీర్మానం ద్వారా తామే దించేస్తామని అల్టిమేటం ఇచ్చారు. మెలిపాక ఎంపీటీసీ సభ్యుని మృతితో ఆ స్థానం ఖాళీగా వుంది. ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలంటే మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది సంతకాలు చేయాలి. ప్రస్తుతం 15 మంది సభ్యులు వున్నారు. అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి 10 మంది సభ్యులు వుండాలి. ఎంపీపీ, వైఎస్ఎంపీపీలకు వ్యతిరేకంగా పది మంది సభ్యులు వుండడంతో శుక్రవారం ఎంపీడీవో ఎం.ఉషారాణిని కలిసి అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారు. అనంతరం అనకాపల్లి వెళ్లి ఆర్డీవోకు కూడా నోటీసు ఇచ్చారు. ఎంపీటీసీ సభ్యులు సూరిశెట్టి రమణ, మద్దాల వీరునాయుడు, మొల్లేటి కృష్ణవేణి, శరగడం అప్పలనర్సమ్మ, ఇళ్ల శిరీష, బొడ్డేడ హైమ, తదితరులు నోటీసుపై సంతకాలు చేశారు.