Share News

అరకులోయలో ఎన్‌సీసీ ట్రెక్కింగ్‌ క్యాంప్‌

ABN , Publish Date - May 01 , 2026 | 12:24 AM

అరకులోయలో మే 24 నుంచి 31వ తేదీ వరకు ఎన్‌సీసీ ట్రెక్కింగ్‌ క్యాంప్‌ జరుగుతుందని, దానిని అధికారులు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు.

 అరకులోయలో ఎన్‌సీసీ ట్రెక్కింగ్‌ క్యాంప్‌
అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ నిషాంతి, పక్కన జేసీ శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ

మే 24 నుంచి 31 వరకు అరకులోయ,

అనంతగిరి మండలాల కొండల్లో నిర్వహణ

విజయవంతం చేయండి : కలెక్టర్‌ నిషాంతి

పాడేరు, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): అరకులోయలో మే 24 నుంచి 31వ తేదీ వరకు ఎన్‌సీసీ ట్రెక్కింగ్‌ క్యాంప్‌ జరుగుతుందని, దానిని అధికారులు విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి ఆదేశించారు. ట్రెక్కింగ్‌ క్యాంప్‌ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్‌సీసీ ఆధ్వర్యంలో వారం రోజులపాటు అరకులోయ, అనంతగిరి మండలాల్లో జరిగే ట్రెక్కింగ్‌ క్యాంప్‌కు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అరకులోయలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంగా ఈ క్యాంప్‌ నిర్వహణ జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది ఎన్‌సీసీ క్యాడెట్లు వస్తారన్నారు. పోలీసులు ట్రెక్కింగ్‌ మార్గాల్లో భద్రత కల్పించాలని, అటవీ శాఖ గైడ్లను ఏర్పాటు చేయాలన్నారు. రెవెన్యూ శాఖ ట్రెక్కింగ్‌ చేసే ప్రదేశాల గుర్తింపు, అనుమతులు వంటివి చూసుకోవాలని, వైద్యారోగ్యశాఖ నిరంతర వైద్య సేవలు అందించాలన్నారు. పంచాయతీరాజ్‌ శాఖాధికారులు మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు కల్పించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ట్రెక్కింగ్‌ క్యాంప్‌ను సంపూర్ణంగా విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఎన్‌సీసీ 13వ బెటాలియన్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌ నీరజ్‌కుమార్‌, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, గిరిజన సంక్షేమ డీడీ పీబీకే.పరిమిళ, ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ప్రసాద్‌, ఏడీఎంహెచ్‌వో టి.ప్రతాప్‌, సీఐ డి.దీనబందు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:24 AM