ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించాలి
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:44 AM
ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మండలంలోని అరట్లకోట సమీపంలోని పొలాల్లో శుక్రవారం ‘రైతన్నా మీ కోసం- ఎల్నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దమ్ముపట్టిన పొలంలోకి దిగి రైతులు, కూలీలతో కలిసి కొద్దిసేపు వరి నాట్లు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి సేద్యం వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గుతుందని, నాణ్యమైన పంట దిగుబడులు సాధించవచ్చని అన్నారు.
తక్కువ పెట్టుబడితో నాణ్యమైన పంట దిగుబడులు
కలెక్టర్ విజయకృష్ణన్
పాయకరావుపేట రూరల్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మండలంలోని అరట్లకోట సమీపంలోని పొలాల్లో శుక్రవారం ‘రైతన్నా మీ కోసం- ఎల్నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక’ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా దమ్ముపట్టిన పొలంలోకి దిగి రైతులు, కూలీలతో కలిసి కొద్దిసేపు వరి నాట్లు వేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రకృతి సేద్యం వల్ల రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గుతుందని, నాణ్యమైన పంట దిగుబడులు సాధించవచ్చని అన్నారు. అంతేకాక ప్రజలకు రసాయన అవశేషాలు లేని ఆహార పదార్థాలు అందుబాటులో వుంటాయని, పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందుని, అందువల్ల పంటల సాగు విషయంలో రైతులు ఆచీతూచీ వ్యవహరించాలని కోరారు. సేంద్రియ వ్యవసాయంలో వినియోగించే ఘన జీవామృతం, ద్రవజీవామృతం, అజొల్లా, అగ్నాస్త్రం, పంచగవ్యం, తదితర వాటిని కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశాదేవి, ప్రకృతి సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లచ్చన్న, డీఆర్డీఏ పీడీ శచీదేవి, వ్యవసాయ శాఖ ఏడీ ఉమాప్రసాద్, ఏవో ఆదినారాయణ, ఏఈవోలు నాగమణి, సత్యనారాయణ, తాండవ రైతు ఉత్పత్తిదారుల సేవాకేంద్రం సీఈవో జి.సత్యనారాయణ, కూటమి నాయకులు చించలపు ప్రదీప్, యాళ్ల వరహాలు, మజ్జూరి నారాయణరావు, గొల్లపల్లి నాగు, కట్టా శ్రీను, వెంకటేశ్వరరావు, పలువురు రైతులు పాల్గొన్నారు.