Share News

ప్రకృతి సాగు ఎంతో మేలు

ABN , Publish Date - May 29 , 2026 | 10:45 PM

గిరిజన ప్రాంతంలో రైతులు అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతో మేలని నీతి అయోగ్‌ అధికారి గుల్జార్‌ నటరాజన్‌ అన్నారు.

ప్రకృతి సాగు ఎంతో మేలు
మినుములూరులో అంగన్‌వాడీ చిన్నారులతో ముచ్చటిస్తున్న నీతి అయోగ్‌ అధికారి గుల్జార్‌ నటరాజన్‌

నీతి అయోగ్‌ అధికారి గుల్జార్‌ నటరాజన్‌

పాడేరు మండలంలో పలు ప్రాంతాలు సందర్శన

పాడేరు, మే 29 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో రైతులు అవలంబిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఎంతో మేలని నీతి అయోగ్‌ అధికారి గుల్జార్‌ నటరాజన్‌ అన్నారు. మండలంలో రైతు సాధికారత సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను శుక్రవారం పరిశీలించారు. మండలంలోని రాములుపుట్టు బయో రిసోర్సు సెంటర్‌, అక్కడ ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ప్రదర్శనను ఆయన పరిశీలించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ప్రకృతి వ్యవసాయం చేయాలని ఆయన సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో పంట సాగు, చేపట్టాల్సిన చర్యలపై రైతు సాధికారత సంస్థ రూపొందించిన ప్రత్యేక సంచికను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మినుములూరులోని అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ సచివాలయాన్ని, మోదాపల్లిలో కాఫీ తోటలను ఆయన పరిశీలించారు. మినుములూరు అంగన్‌వాడీ కేంద్రంలో పలువురు గర్భిణులకు సీమంతాలు నిర్వహించిన, అక్కడ చిన్నారులతో ఆయన ముచ్చటించారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ టి.నిషాంతి, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా రైతు సాధికారత సంస్థ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ ఎల్‌.భాస్కరరావు, సమగ్ర శిక్ష ఏపీసీ స్వామినాయుడు, పలు శాఖల అధికారులు, గిరిజన రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 10:45 PM