నర్సీపట్నం ఆస్పత్రి అభివృద్ధి
ABN , Publish Date - Feb 13 , 2026 | 01:03 AM
స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలోని ఓపీ విభాగం కౌంటర్ను కొత్త భవనంలోకి మార్చనున్నారు. డాక్టర్లు ఇప్పుడు ఎక్కడైతే వైద్యం చేస్తున్నారో అక్కడే కొనసాగుతారు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం ఉన్న ఓపీ చీటీల జారీ కౌంటర్ ఆస్పత్రిలోకి ప్రవేశించే ప్రధాన మార్గం దగ్గర ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది.
నూతన భవనంలోకి సాధారణ ఓపీ
పాత ఓపీ ప్రదేశం ప్రసూతికి కేటాయింపు
ఆపరేషన్ థియేటర్కు సెంట్రల్ ఆక్సిజన్
నర్సీపట్నం, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): స్థానిక ప్రాంతీయ ఆస్పత్రిలోని ఓపీ విభాగం కౌంటర్ను కొత్త భవనంలోకి మార్చనున్నారు. డాక్టర్లు ఇప్పుడు ఎక్కడైతే వైద్యం చేస్తున్నారో అక్కడే కొనసాగుతారు. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ప్రస్తుతం ఉన్న ఓపీ చీటీల జారీ కౌంటర్ ఆస్పత్రిలోకి ప్రవేశించే ప్రధాన మార్గం దగ్గర ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది. దీంతో ఓపీ కౌంటర్ని కొత్త భవనంలోకి తరలించి, దీనిని ప్రత్యేక ప్రసూతి ఓపీ విభాగంగా మార్చాలని సూపరింటెండెంట్ డాక్టర్ సుధాశారద చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న గర్భిణుల ఓపీ గది ఇరుకుగా వుండడంతో దీనిని పాత ఓపీ వద్దకు తరలించాలని నిర్ణయించారు. కాగా కొత్త భవనంలో ఓపీ కౌంటర్ సిద్ధం చేశారు. స్టీల్ పైపులతో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఏరియా ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి రోజూ వివిధ మండలాల నుంచి 500 మంది వరకు రోగులు వస్తుంటారు. సోమ, బుధ, శనివారాల్లో ఓపీ 600 దాటి పోతుంది. ఈ విభాగాన్ని కొత్త భవనంలోకి తరలించడం వల్ల ప్రదేశ మార్గం వద్ద రద్దీ వుండదు. కొత్త భవనం వద్ద ఓపీ చీటి రాయించుకొని, వైద్యులకు చూపించుకోవడానికి పాత భవనం వద్దకు రావాల్సి ఉంటుంది. ఏరియా ఆస్పత్రిలో రూ.24 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓపీ విభాగం పనులు కూడా చేపట్టారు. ఆపరేషన్ థియేటర్కు రూ.7 లక్షలతో సెంట్రల్ ఆక్సిజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.