మే 10 నుంచి మోదకొండమ్మ ఉత్సవాలు
ABN , Publish Date - Feb 22 , 2026 | 11:15 PM
స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలను ఈ ఏడాది మే నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహణ
ప్రత్యేక సమావేశంలో తేదీలు ప్రకటించిన ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కోటినాయుడు
పాడేరు, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక మోదకొండమ్మ ఉత్సవాలను ఈ ఏడాది మే నెల 10, 11, 12 తేదీల్లో నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం మోదకొండమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటినాయుడు ప్రకటించారు. ప్రతి ఏడాది మే నెలలో మోదకొండమ్మ ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. అందుకు గాను ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు, ప్రధాన కార్యదర్శి కిల్లు కోటినాయుడు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతలు, గ్రామపెద్దలు, వర్తక సంఘం నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల తేదీలకు ప్రధానార్చకుడు సుబ్రహ్మణ్యం ముహూర్తం పెట్టారు. దీంతో మే నెల 10, 11, 12 తేదీల్లో ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి కిల్లు కోటినాయుడు ప్రకటించారు. ఈ ఏడాది ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందరి సహకారంతో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, వివిధ పార్టీల రాజకీయ నేతలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.