2,034 పాఠశాలల్లో మెగా పీటీఎం
ABN , Publish Date - Jul 24 , 2026 | 12:46 AM
జిల్లాలో మెగా పేరెంట్- టీచర్ మీట్(పీటీఎం) 4.0ను శుక్రవారం విజయవంతంగా నిర్వహించాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. మెగా పీటీఎంపై గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు.
- విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశం
- శత శాతం తల్లిదండ్రులు హాజరుకావాలని సూచన
పాడేరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మెగా పేరెంట్- టీచర్ మీట్(పీటీఎం) 4.0ను శుక్రవారం విజయవంతంగా నిర్వహించాలని విద్యాశాఖాధికారులను కలెక్టర్ టి.నిషాంతి ఆదేశించారు. మెగా పీటీఎంపై గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ మాట్లాడారు. పీటీఎం కార్యక్రమం పాఠశాల, విద్యాభివృద్ధికి దోహదపడాలని, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించాలని, శత శాతం తల్లిదండ్రులు పీటీఎంకు హాజరయ్యేలా ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలన్నారు. అలాగే కార్యక్రమానికి హాజరైన వారందరికీ కనీస సదుపాయాలు కల్పించాలని, సూచించిన మెనూ ప్రకారం భోజనాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా మెగా పీటీఎం నిర్వహణపై ప్రధానోపాధ్యాయులు, టీచర్లు చేపట్టాల్సిన చర్యలను సమగ్ర శిక్ష ఏపీడీ స్వామినాయుడు, ఇన్చార్జి డీఈవో, టీడబ్ల్యూ డీడీ పరిమిళ వివరించారు. జిల్లాలో 2,034 పాఠశాలల్లో మెగా పీటీఎం జరుగుతుందని, కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వివరాలను సంబంధిత యాప్లో విధిగా అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, జిల్లాలోని పదకొండు మండలాలకు చెందిన విద్యాశాఖాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.