13 మండలాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
ABN , Publish Date - Jan 03 , 2026 | 11:43 PM
జిల్లాలో వీఎంఆర్డీఏ విలీన మండలాల అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయబోతున్నారు.
వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న మండలాల్లో సర్వే
2047లో జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక
నర్సీపట్నం, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వీఎంఆర్డీఏ విలీన మండలాల అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక తయారు చేయబోతున్నారు.
జిల్లాలో వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్న 13 మండలాల్లో ఈ సర్వే జరుగుతోంది. జియోకాన్ సర్వేస్ ప్రైవేటు లిమిటెడ్, ఖరగ్పూర్ ఐఐటీ సంస్థ సంయుక్తంగా సర్వే చేస్తున్నాయి. మాడుగుల, చీడికాడ, కె.కోటపాడు, దేవరాపల్లి, చోడవరం, రావికమతం, బుచ్చెయ్యపేట, నర్సీపట్నం, గొలుగొండ, నాతవరం, మాకవరపాలెం, నాతవరం, కోటవురట్ల మండలాలు, విజయనగరం జిల్లాలోని మొరకముడిదం మండలాలు వీఎంఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. ఈ మండలాలలో 2047లో జనాభా అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నారు. రహదారుల విస్తరణ, డ్రైనేజీలు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, గృహాలు, మిక్సిడ్ యూజెస్, రవాణా, వర్క్ సెంటర్లు, పబ్లిక్ అండ్ సెమీ పబ్లిక్, గ్రీనరీ, రిక్రియేషన్ జోన్లుగా విభజిస్తారు. రెవెన్యూ సరిహద్దు మ్యాపింగ్, గ్రౌండ్ కంట్రోల్ పాయింట్లు గుర్తిస్తున్నారు. నర్సీపట్నం పురపాలక సంఘం బృహత్తర ప్రణాళిక సిద్ధం చేశారు. మండలాల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేసిన తర్వాత అమృత్ పథకం నిబంధనల ప్రకారం ఒక మాస్టర్ ప్రణాళిక తయారు చేస్తారు. ప్రస్తుతం సర్వే పనులు వేగంగా జరుగుతున్నాయి. వీఎంఆర్డీఏ పరిధిలోని మండలాల్లో బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు.