రహదారులకు మహర్దశ
ABN , Publish Date - Mar 01 , 2026 | 01:22 AM
గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులకు కూటమి ప్రభుత్వంలో మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రహదారులపై దృష్టి పెట్టింది. మొదటి విడతలో మరమ్మతులకు ప్రాధ్యానం ఇచ్చిన ప్రభుత్వం రెండో విడతలో పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.
- గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లు
- రాకపోకలకు వాహనాల అవస్థలు
- కూటమి ప్రభుత్వంలో నిధులు మంజూరు
- శరవేగంగా పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ రోడ్ల నిర్మాణం
సబ్బవరం, ఫిబ్రవరి 28 (ఆంరఽధజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రహదారులకు కూటమి ప్రభుత్వంలో మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రహదారులపై దృష్టి పెట్టింది. మొదటి విడతలో మరమ్మతులకు ప్రాధ్యానం ఇచ్చిన ప్రభుత్వం రెండో విడతలో పూర్తిస్థాయిలో రహదారుల నిర్మాణానికి చర్యలు చేపట్టింది.
అసకపల్లి- లంకెలపాలెం రోడ్డు గత ఏడాది వరకు అధ్వానంగా ఉండేది. వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్బాబు చొరవ తీసుకొని మండల పరిధిలోని ఆర్ అండ్ బీ రోడ్లు, గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అధ్వానంగా ఉన్న అసకపల్లి- లంకెలపాలెం రోడ్డు నిర్మాణానికి రూ.2.5 కోట్లు మంజూరు చేయగా, 80 శాతం పనులు పూర్తయ్యాయి. సబ్బవరం- చోడవరం రోడ్డు(లా వర్సిటీ జంక్షన్) నుంచి గొటివాడ, అంతకాపల్లి, రావలమ్మపాలెం గ్రామాల మీదుగా గుల్లేపల్లి రోడ్డుకు రూ.1.95 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి, మేడపురెడ్డి వారి కళ్లాలు నుంచి గుల్లేపల్లి రోడ్డుకు రూ.70 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. అంతకాపల్లి ముత్యమాంబ అమ్మవారి పండుగ నాటికి ఈ రెండు రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని గత ఏడాది నవంబరులో రావలమ్మపాలెంలో జరిగిన మన పల్లెకు- మన ఎమ్మెల్యే కార్యక్రమంలో కూటమి నేతలు చొక్కాకుల వెంకటరావు, ఎంపీటీసీ సభ్యుడు చొక్కకుల గోవింద, రొంగలి దేముడు, మిడతా మహాలక్ష్మీనాయుడు... ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్బాబును కోరారు. ఇచ్చిన హామీ మేరకు మూడు నెలల్లో పనులు పూర్తి చేయించి ఎమ్మెల్యే మాట నిలబెట్టుకున్నారని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా అనకాపల్లి జాతీయ రహదారి నుంచి గవరవానిపాలెం వరకు బీటీ రోడ్డుకు రూ.75 లక్షలు, గాలిభీమవరం- నక్కవానిపాలెం బీటీ రోడ్డుకు రూ.70 లక్షలు మంజూరు చేయడంతో రోడ్డు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అదే విధంగా పైడివాడఅగ్రహారం, గాలిభీమవరం, చినయాతపాలెం, నాయమ్మపాలెం, స్థానిక సాయినగర్ కాలనీలో అంతర్గత సీసీ రోడ్లు, స్థానిక పీహెచ్సీకి రూ. 15.25 లక్షలు, సబ్బవరం మెయిన్ రోడ్డు నుంచి సీడీపీవో కార్యాలయం మీదుగా ఎంఆర్సీ వరకు రూ.15.28 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి.