జీఎస్టీ పేరుతో దోపిడీ
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:26 AM
నగరంలో కొందరు వ్యాపారులు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. హోటళ్లు, టిఫిన్పార్లర్లు, మసాజ్సెంటర్లలో ఈ వ్యవహారం రహస్యంగా సాగుతోంది. వీటిలో ఐదు శాతం, మసాజ్సెంటర్లలో 18 శాతం జీఎస్టీగ వసూలుచేస్తున్నారు. కానీ చాలామంది ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరకుండా అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు ఆదివారం పలుహోటళ్లలో సోదాలు నిర్వహించడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
హోటళ్లు, మసాజ్సెంటర్లు, పార్లర్లలో అవకతవకలు
అధికారికఅకౌంట్తో పాటు అనధికారిక ఖాతా నిర్వహణ
జీఎస్టీ వసూలుచేసినా ప్రభుత్వ ఖజానాకు చే రని వైనం
కస్టమర్లకు అనుమానం రాకుండా ప్రింటెడ్ బిల్లు అందజేత
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరంలో కొందరు వ్యాపారులు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. హోటళ్లు, టిఫిన్పార్లర్లు, మసాజ్సెంటర్లలో ఈ వ్యవహారం రహస్యంగా సాగుతోంది. వీటిలో ఐదు శాతం, మసాజ్సెంటర్లలో 18 శాతం జీఎస్టీగ వసూలుచేస్తున్నారు. కానీ చాలామంది ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరకుండా అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు ఆదివారం పలుహోటళ్లలో సోదాలు నిర్వహించడం ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది.
నగరంలో అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలతో పాటు పేరొందిన విద్యాసంస్థలున్నాయి. పర్యాటకంగా ప్రాముఖ్యం ఉండడంతో నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. దీంతో నగరంలో హోటళ్లు, టిఫిన్పార్లర్లకు తాకిడి ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం ‘ఒకేదేశం-ఒకే పన్ను’ పేరుతో జీఎస్టీని అమల్లోకి తేవడంతో హోటళ్లు, టిఫిన్పార్లర్ల వ్యాపారులు జీఎస్టీలో నమోదుచేసుకోవాలన్నది నిబంధన. వ్యాపారం కేటగిరీని బట్టి వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలుచేయాలి. ఈ మేరకు హోటళ్లు, టిఫిన్పార్లర్లు, కర్రీపాయింట్లు ఐదు శాతం జీఎస్టీ వసూలుచేయాలి. బిల్లుతోపాటు కేంద్రం వాటా జీఎస్టీ (సీజీఎస్టీ), రాష్ట్రం వాటా జీఎస్టీ (ఎస్జీఎస్టీ) వివరాలతో కంప్యూటరైజ్డ్ ప్రింటింగ్ బిల్లును వినియోగదారులకు అందజేయాలి.
వ్యాపారుల చేతివాటం
హోటళ్లు, టిఫిన్పార్లర్లకు వచ్చే వినియోగదారులకు బిల్లు ఇచ్చే సమయంలో కొందరు వ్యాపారులు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులు అధికారికంగా ఒకటి, అనధికారికంగా మరో ఖాతాను నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. యూపీఐ, కార్డుపేమెంట్లు జరిగేటపుడు అధికారికంగా నమోదుచేసుకున్న ఖాతాకు బిల్లు జమ చేస్తుండగా, క్యాష్పేమెంట్లను అనధికారిక ఖాతాకు జమచేసి, లావాదేవీలు ప్రభుత్వం దృష్టికి వెళ్లనివ్వడం లేదంటున్నారు. ప్రతి రోజూ జరిగే వ్యాపారంలో కనీసం 20 శాతం క్యాష్పేమెంట్లు ఉండగా, ఆ మొత్తానికి ప్రింటెడ్ బిల్లులు ఇచ్చినా, సాయంత్రానికి డేటాను తమ కంప్యూటర్ల నుంచి డిలీట్ చేయడంతో జీఎస్టీ అధికారుల దృష్టికి వెళ్లడం లేదంటున్నారు. మసాజ్పార్లర్లలో కూడా ఇదే తరహా వ్యవహారం సాగుతోందనే ప్రచారం జరుగుతోంది. మసాజ్పార్లర్లలో 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తారు. ఈ సెంటర్లకు వెళ్లినవారు ఎక్కువగా నగదు చెల్లిస్తారు. దీనిని ఆసరాగా చేసుకుని నిర్వాహకులు సెంటర్కు వచ్చేవారి వివరాలను జీఎస్టీ అధికారులకు చేరకుండా, కంప్యూటర్లలో ఎంటర్చేయడం లేదని సమాచారం. నగరంలో సెలబ్రేషన్స్ గ్రూపునకు చెందిన నాలుగు హోటళ్లలో జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు ఆదివారం సోదాలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి హోటళ్లు, టిఫిన్పార్లర్లో సోదాలు చేస్తే వ్యాపారుల దోపిడీ బయటపడుతుందని అభిప్రాయపడుతున్నారు.