ఆరోగ్యయోగం అందిద్దాం
ABN , Publish Date - Jun 21 , 2026 | 10:59 PM
ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన చక్కని వాతావరణం ఉన్న జిల్లాలోని ప్రజలంతా యోగాను పాటించాలని, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జిల్లాగా మారుద్దామని కలెక్టర్ టి.నిషాంతి పిలుపునిచ్చారు.
సంతోషకరమైన జిల్లాగా మారుద్దాం
కలెక్టర్ టి.నిషాంతి
ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
అరకులోయ, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన చక్కని వాతావరణం ఉన్న జిల్లాలోని ప్రజలంతా యోగాను పాటించాలని, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జిల్లాగా మారుద్దామని కలెక్టర్ టి.నిషాంతి పిలుపునిచ్చారు. ఆదివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు భగవంతుడు చక్కని ఆహ్లాదకర వాతావరణాన్ని ఇచ్చాడని, ఇలాంటి ఆహ్లాదకర, ఆరోగ్యకరమైన వాతావరణంలో యోగాంధ్ర- 2026 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మూడు విభిన్న ఆంశాలతో యోగా కార్యక్రమాలను నిర్వహించామన్నారు. హుకుంపేట మండలం మత్స్యగుండం వద్ద ఆధ్యాత్మిక యోగా, జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతం వద్ద పర్యాటక యోగా, అరకులోయ మండలం మాడగడ సన్రైజ్ వ్యూపాయింట్ వద్ద ప్రకృతి యోగా నిర్వహించామని చెప్పారు. ఆదివారం అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సుమారు మూడు వేల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. వాస్తవానికి గిరిజన ప్రాంత ప్రజలు సహజంగానే ప్రకృతికి దగ్గరగా ఉంటారన్నారు. యోగా, ప్రకృతి రెండు కలిస్తే ఆరోగ్యవంతమైన జీవితం సాకారమవుతుందని చెప్పారు. అలాగే జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి, టీడీపీ అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి దొన్నుదొర తదితరులు యోగా విశిష్టతకు తెలియజేశారు. అనంతరం కలెక్టర్, జేసీ, ఐటీడీఏ పీవో, గిడ్డి ఈశ్వరి, దొన్నుదొర, అన్ని శాఖల అధికారులు, పలు ఆశ్రమోన్నత పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు.