Share News

కృష్ణాపురం పైనరీ అభివృద్ధి

ABN , Publish Date - Jul 10 , 2026 | 10:45 PM

ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి సమీపంలో ఉన్న కృష్ణాపురం పైనరీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌) ఐకేవీ రాజు అన్నారు.

కృష్ణాపురం పైనరీ అభివృద్ధి
అటవీశాఖ డివిజన్‌ కార్యాలయంలో మొక్కలు నాటుతున్న సీసీఎఫ్‌ ఐకేవీ రాజు, డీఎఫ్‌వో నరసింహరావు

పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు

సీడ్‌ బాల్స్‌తో పచ్చదనం పెంపు

అటవీశాఖ సీసీఎఫ్‌ ఐకేవీ రాజు

చింతపల్లి, జూలై 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రకశ్మీర్‌ లంబసింగికి సమీపంలో ఉన్న కృష్ణాపురం పైనరీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (సీసీఎఫ్‌) ఐకేవీ రాజు అన్నారు. శుక్రవారం సీసీఎఫ్‌ స్థానిక డీఎఫ్‌వో వైవీ నరసింహరావుతో కలిసి మండలంలో పర్యటించారు. తొలుత కృష్ణాపురం పైనరీని సందర్శించారు. చిన్నగెడ్డ టింబర్‌ డిపోలో టేక్‌, మారుజాతి కలపకు వేలం పాట నిర్వహించారు. చింతపల్లి డివిజన్‌ అటవీ కార్యాలయంలో మొక్కలు నాటి, నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీఎఫ్‌ మాట్లాడుతూ పర్యాటక సీజన్‌ సమీపిస్తుండడంతో పైనరీలో పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పైనరీ అభివృద్ధికి రూ.25లక్షలు కేటాయించిందన్నారు. ఈ నిధులతో పైనరీలో మూడు సెమీ పర్మినెంట్‌ కాటేజీలు, అడ్వెంచర్‌, చిన్నపిల్లల పార్కు, టెక్కింగ్‌ పాత్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిర్మాణ పనులు 90 శాతం పూర్తి చేశామన్నారు. ఇప్పటికే పైనరీలో వాష్‌రూమ్స్‌, సింగిల్‌, డబుల్‌ టెంట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పర్యాట సీజన్‌ నాటికి పూర్తి స్థాయి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సీడ్‌ బాల్స్‌ ద్వారా పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. డివిజన్ల వారీగా అటవీ శాఖ ఉద్యోగులు, విద్యార్థులు, స్వయం సహాయం సంఘాల సభ్యుల సహకారంతో సీడ్‌ బాల్స్‌ని తయారుచేసి అడవులు, మొక్కలు లేని ప్రాంతాల్లో వెదజల్లుతున్నామన్నారు. అటవీ శాఖ ద్వారా నర్సరీలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో రేంజ్‌ అధికారి బి. అప్పారావు, అటవీ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2026 | 10:45 PM