రోడ్డు ప్రమాదంలో కలాసీ మృతి
ABN , Publish Date - Apr 27 , 2026 | 01:01 AM
మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పునరావాస కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కలాసీ మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి...
అచ్యుతాపురం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) పునరావాస కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కలాసీ మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా వున్నాయి... సెజ్ పునరావాస కాలనీ దిబ్బపాలెం పంచాయతీ పరిధిలోని మోటూరుపాలేనికి చెందిన మడగల అప్పలరాజు (46) ప్రత్యేక ఆర్థిక మండలిలోని కర్మాగారాల్లో కలాసీగా పనులు చేస్తున్నాడు. ఆదివారం బ్రాండిక్స్ ఆవరణలోగల టీజే కర్మాగారంలో పని ఉందని ఫోన్ రావడంతో మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు ఇంటినుంచి బైక్పై బయలు దేరాడు. దిబ్బపాలెం వాటర్ ట్యాంకు వద్ద రోడ్డు మధ్యలో వున్న పెద్ద గుంటలో బైక్ చక్రం పడడంతో అదుపు తప్పి పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో కుటుంబ సభ్యులు వచ్చి అచ్యుతాపురంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి బయలుదేరారు. కానీ అప్పలరాజు దారిలోనే మృతిచెందాడు. భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.