ఉత్సవ ఏర్పాట్లు జేసీ పరిశీలన
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:09 PM
మండలంలోని మత్స్యగుండంలో శనివారం నుంచి మొదలయ్యే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమని శ్రీపూజ శుక్రవారం పరిశీలించారు.
అధికారులు, నిర్వాహకులకు సూచనలు
హుకుంపేట, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): మండలంలోని మత్స్యగుండంలో శనివారం నుంచి మొదలయ్యే మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమని శ్రీపూజ శుక్రవారం పరిశీలించారు. మత్స్యగుండంలోని సదుపాయాలు, భక్తుల రాకపోకలకు అనువుగా ఏర్పాటు చేసిన బారికేడ్లు, తదితరలను ఆమె పరిశీలించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని, తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తుల భద్రత, అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా అధికారులు ఉత్సవ కమిటీ ప్రతినిధులకు ఆయన పలు సూచనలు చేశారు.
మత్స్యగుండంలో శనివారం నుంచి మూడు రోజులు నిర్వహించే శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయం, పరిసరాలు, ప్రవేశద్వారం తదితరలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే మత్య్సాల దర్శనానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు లేకుండా బారికేడ్లు, ఇతర రక్షణ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వరరావు, డీఎస్పీ అభిషేక్, స్వర్ణ గ్రామ శాఖ జిల్లా నోడల్ అధికారి పీఎస్.కుమార్, సీఐ సన్యాసినాయుడు, వివిధ శాఖల అధికారులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, సర్పంచ్ ఎం.శాంతకుమారి, తదితరులు పాల్గొన్నారు.