రికార్డుస్థాయిలో బెల్లం లావాదేవీలు
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:27 AM
స్థానిక ఎన్టీఆర్ మార్కెట్యార్డులో ప్రస్తుత సీజన్లో శుక్రవారం రికార్డుస్థాయిలో బెల్లం లావాదేవీలు జరిగాయి. వివిధ గ్రామాల నుంచి రైతులు 11,556 బెల్లం దిమ్మలు తీసుకొచ్చి విక్రయించారు. ఇప్పటి వరకు రోజూ ఆరు వేల లోపే బెల్లం దిమ్మలు వస్తున్నాయి. అయితే నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మార్కెట్కు సెలవు కావడంతో శుక్రవారం ఎక్కువ మంది రైతులు బెల్లం దిమ్మలు తీసుకువచ్చారు.
ఎన్టీఆర్ మార్కెట్ యార్డుకు ఒక్క రోజే 11,556 బెల్లం దిమ్మలు రాక
ప్రస్తుత సీజన్లో ఇవే అత్యధికం
నెల రోజుల నుంచి స్థిరంగా ధరలు
పండుగ సమయంలోనూ పెరగడం లేదని రైతుల నిరాశ
అనకాపల్లి టౌన్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్టీఆర్ మార్కెట్యార్డులో ప్రస్తుత సీజన్లో శుక్రవారం రికార్డుస్థాయిలో బెల్లం లావాదేవీలు జరిగాయి. వివిధ గ్రామాల నుంచి రైతులు 11,556 బెల్లం దిమ్మలు తీసుకొచ్చి విక్రయించారు. ఇప్పటి వరకు రోజూ ఆరు వేల లోపే బెల్లం దిమ్మలు వస్తున్నాయి. అయితే నూతన సంవత్సరం సందర్భంగా గురువారం మార్కెట్కు సెలవు కావడంతో శుక్రవారం ఎక్కువ మంది రైతులు బెల్లం దిమ్మలు తీసుకువచ్చారు. ప్రస్తుత సీజన్లో డిసెంబరు ఒకటో తేదీన 7,049 బెల్లం దిమ్మలు యార్డుకు వచ్చాయి. డిసెంబరు చివరి వరకు ఇదే అత్యధికం. శుక్రవారం ఏకంగా నాలుగున్నర వేల దిమ్మలు అధికంగా వచ్చాయి. ఒకటో రకం బెల్లం వంద కిలోలు రూ.4,250లు, రెండో రకం రూ.3,700లు, మూడో రకం రూ.3,300 ధర పలికాయి. గత నెల రోజుల్లో పెద్ద ధరల్లో పెద్దగా మార్పు లేదని మార్కెట్ యార్డు వర్తకులు తెలిపారు. సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్నప్పటికీ బెల్లం ధరలు ఆశాజనకంగా లేవంటూ రైతులు నిరుత్సాహంగా వున్నారు. కాగా మార్కెట్ యార్డుకు వచ్చే బెల్లం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఒడిశా, ఝార్ఖండ్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్టు వర్తకులు చెబుతున్నారు.