ఆలయానికి చేరిన జగన్నాథుడు
ABN , Publish Date - Jul 27 , 2026 | 01:04 AM
దశావతారాల్లో భక్తులను కరుణించిన జగన్నాథుడు టర్నర్ చౌల్ట్రీ కల్యాణ మండపం నుంచి తిరిగి ఆలయానికి చేరాడు.
ఘనంగా తిరుగు రథయాత్ర
ఉత్సాహంగా పాల్గొన్న భక్తులు
దశావతారాల్లో భక్తులను కరుణించిన జగన్నాథుడు టర్నర్ చౌల్ట్రీ కల్యాణ మండపం నుంచి తిరిగి ఆలయానికి చేరాడు. బలభద్ర, సుభద్రతో సహా ఈనెల 16న టౌన్ కొత్తరోడ్డులోని ఆలయం నుంచి టర్నర్ చౌలీ్ట్ర కల్యాణ మండపానికి చేరుకుని, పది రోజుల పాటు వివిధ రూపాల్లో పూజలందుకున్న స్వామి తిరుగు రథయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. ఇందులో భాగంగా ఉదయం రథంలో స్వామివారి విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్దసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం జగన్నాథుని తిరుగు రథయాత్రను ప్రారంభించారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. గోవింద నామస్మరణతో ఈ ప్రాంతం మార్మోగింది. జయజయధ్వానాల మధ్య టౌన్ కొత్తరోడ్డులోని ఆలయానికి చేరుకున్న రథంలోని జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను విశేష పూజల నడుమ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈవో టి.రాజగోపాలరెడ్డి రథయాత్రను పర్యవేక్షించారు.
- మహారాణిపేట, ఆంధ్రజ్యోతి