అంతా మా ఇష్టం!
ABN , Publish Date - Aug 27 , 2026 | 01:15 AM
మండలంలోని ధర్మవరం అగ్రహారంలో జాతీయ రహదారిని ఆనుకొని వున్న సినిమా థియేటర్ వద్ద ప్రమాదం పొంచివుంది. సినిమా ప్రదర్శన పూర్తయిన పిమ్మట బయటకు వచ్చే ప్రేక్షకులకు, తదుపరి ఆట చూడడానికి థియేటర్ వద్దకు వచ్చే ప్రేక్షకులకు ఒకేదారి వుండడంతో జాతీయ రహదారిపై వచ్చేస్తున్నారు.
ధర్మవరం అగ్రహారం వద్ద హైవే పక్కన థియేటర్
సినిమా చూడడానికి రోడ్డుపై వేచి ఉంటున్న ప్రేక్షకులు
జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా వాహనాలు నిలుపుదల
పట్టించుకోని థియేటర్ యాజమాన్యం, పోలీసులు
ఎస్.రాయవరం, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ధర్మవరం అగ్రహారంలో జాతీయ రహదారిని ఆనుకొని వున్న సినిమా థియేటర్ వద్ద ప్రమాదం పొంచివుంది. సినిమా ప్రదర్శన పూర్తయిన పిమ్మట బయటకు వచ్చే ప్రేక్షకులకు, తదుపరి ఆట చూడడానికి థియేటర్ వద్దకు వచ్చే ప్రేక్షకులకు ఒకేదారి వుండడంతో జాతీయ రహదారిపై వచ్చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలను రోడ్డుపైనే నిలుపుతున్నారు. దీంతో హైవేపై ఒక లైనులోనే వాహనాలు వెళ్లాల్సి వస్తున్నది. జాతీయ రహదారిపై వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతోపాటు ప్రమాదాలు కూడా పెరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో ధర్మవరం అగ్రహారంలోని సినిమా థియేటర్ బయట రహదారిపై కొంతమంది ప్రేక్షకులు వాహనాలను నిర్లక్ష్యంగా నిలుపుదల చేసి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ప్రధానంగా పెద్ద హీరోల కొత్త సినిమాలు విడుదలైన రెండు, మూడు రోజుల వరకు పరిస్థితి ఇలాగే వుంటున్నది. థియేటర్ నిర్వాహకులుగానీ, పోలీసులుగానీ పట్టించుకోవడంతో ఇక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం వుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.