ఉపాధిలో అక్రమాలు
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:50 AM
మండలంలోని కొమరవోలులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కూలీల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు వారానికి రూ.100 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఏడు వారాల ఉపాధి వేతనాల సొమ్మును విడుదల చేయగా వీరు ఒక్కొక్క కూలీ నుంచి రూ.500-700 వరకు బలవంతంగా తీసుకున్నారని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వారంలో ఆరు రోజులు పనిచేస్తే మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే హాజరు వేస్తున్నారని చెబుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ల అక్రమ వసూళ్లపై మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని కూలీలు ఆరోపిస్తున్నారు.
కొమరవోలులో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు
కూలీల నుంచి వారానికి రూ.100 చొప్పున వసూళ్లు
పనులకు రాని వారికి హాజరు నమోదు
కూలీల ఫిర్యాదుతో ఎంపీడీవో విచారణ
పక్షపాతం చూపుతున్నారంటూ ఫిర్యాదుదారుల వాగ్వాదం
శనివారం మరోసారి విచారణ జరుపుతామని ఎంపీడీవో వెల్లడి
రోలుగుంట, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొమరవోలులో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయి. కూలీల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు వారానికి రూ.100 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇటీవల ప్రభుత్వం ఏడు వారాల ఉపాధి వేతనాల సొమ్మును విడుదల చేయగా వీరు ఒక్కొక్క కూలీ నుంచి రూ.500-700 వరకు బలవంతంగా తీసుకున్నారని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వారంలో ఆరు రోజులు పనిచేస్తే మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే హాజరు వేస్తున్నారని చెబుతున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ల అక్రమ వసూళ్లపై మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని కూలీలు ఆరోపిస్తున్నారు.
ఉపాధి పనులకు వెళ్ల వారికి కూడా హాజరు వేస్తున్నారు. గ్రామానికి చెందిన సాకా వరలక్ష్మి (జాబ్ కార్డు నంబరు 010508), నేతి వరలక్ష్మి (జాబ్ కార్డు నంబరు 010718), రావాడ లక్ష్మి (జాబ్ కార్డు నంబరు 010064), కొప్పు రమణమ్మ (జాబ్ కార్డు నంబరు 010054)లతో పలువురు కూలీల ముందుగా రికార్డు చేసి పెట్టుకున్న వీడియాను పని ప్రదేశం దగ్గర ప్లే చేసి మరో ఫోన్ ద్వారా ఫేషియల్ హాజరును నమోదు చేసి మస్తర్లు వేస్తున్నారు. వీటిని గుర్తించి గ్రామానికి చెందిన పలువురు కూలీలు ఎంపీడీఓ, ఏపీఓకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం ఎంపీడీఓ నాగేశ్వరరావు, ఏపీఓ ఈశ్వరరావు కొమరవోలులో ఉపాధి పనులు జరుగుతున్న ప్రదేశానికి వచ్చి విచారణ చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు, ఫిర్యాదు చేసిన వ్యక్తులు మాత్రమే రావాలని, మిగిలిన కూలీలు, ఇతరులు రావద్దని వారు ఆదేశించారు. ఈ విచారణలో ఫీల్డ్ అసిస్టెంట్, మేట్ల నుంచి వాంగ్మూలాలు నమోదు చేసి, కూలీలను విచారించకుండా, ఫిర్యాదుదారులు సేకరించిన ఫొటోలు, మస్తర్ రోల్స్ను పరిశీలించకపోవడంతో అధికారులు, ఫిర్యాదుదారుల మధ్య వాగ్వాదం జరిగింది. పక్కా ఆధారాలు, వీడియోలు సమర్పించి విచారించాలని ఫిర్యాదు చేస్తే... కనీసం పట్టించుకోలేదని, కావాలనే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ ఎంపీడీఓను నిలదీశారు. అనంతరం ఎంపీడీఓ, ఏపీఓలు గ్రామంలో నకిలీ మస్తర్లునమోదు చేసిన ఐదుగురు ఇళ్లకు వెళ్లగా వారు లేదు. దీంతో శనివారం కూలీల సమక్షంలో విచారణ చేపట్టి పూర్తిస్థాయి నివేదిక తయారు చేస్తామని ఎంపీడీఓ నాగేశ్వరరావు తెలిపారు.