సరిహద్దులో సారా స్థావరాలపై ఉక్కుపాదం
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:17 PM
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో సారా తయారీపై రెండు రాష్ట్రాల పోలీస్, ఎక్సైజ్ శాఖలు ఉక్కుపాదం మోపాయి.
భారీగా బెల్లం పులుసు, సారా ధ్వంసం
ఆంధ్రా-ఒడిశా పోలీస్, ఎక్సైజ్ సిబ్బంది దాడులు
పెదబయలు, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో సారా తయారీపై రెండు రాష్ట్రాల పోలీస్, ఎక్సైజ్ శాఖలు ఉక్కుపాదం మోపాయి. శుక్రవారం ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల పోలీస్, ఎక్సైజ్ బృందాలు ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా నందపూర్ బ్లాక్ పరిధిలోని పనసపుట్టు, ఓండ్రొగెడ్డ, సూడుబ్ గ్రామాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించాయి. దాడుల్లో ఒండ్రొగెడ్డ గ్రామంలో మూడు వేల లీటర్ల బెల్లం పులుసు, 250 లీటర్ల సారా, సూడుబ్ గ్రామంలో వెయ్యి లీటర్ల బెల్లం పులుసు, 120 లీటర్ల సారాను ధ్వంసం చేసినట్టు పాడేరు ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టీవీవీఎస్ఎన్ ఆచారి తెలిపారు. పనసపుట్టులో ఎటువంటి అక్రమ నిల్వలు గుర్తించలేదన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సారా తయారీ, రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నామని, ఇకపై ఇటువంటి సంయుక్త దాడులు మరిన్ని జరుపుతామని ఆయన చెప్పారు. నిషేధిత సారా, గంజాయి జోలికి వెళితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఈ దాడుల్లో నందపూర్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సుఽధీర్కుమార్ సాహు, అనకాపల్లి ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ కే సురేష్కుమార్, ఆంధ్రా-ఒడిశా ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు.