సాయం కోరిన ఇరాన్ మహిళలు
ABN , Publish Date - Apr 09 , 2026 | 01:36 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మశీ విభాగంలో ఇంటర్నషిప్ చేస్తున్న సాల్మాజ్ మొహ్మది, జీనాబ్ మొహ్మది అనే ఇద్దరు ఇరాన్ మహిళలు తమ సొంత దేశం వెళ్లేందుకు సహాయపడాలని జిల్లా యంత్రాంగాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు.
ఏయూలో విద్యాభ్యాసం
యుద్ధం మొదలైనప్పటి నుంచి
స్వదేశంలో గల కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు రాకపోవడంతో ఇబ్బందులు
ఇంటి అద్దె, స్కూలు ఫీజులు బాకీ
డీఆర్వోకు వినతిపత్రం
విశాఖపట్నం, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మశీ విభాగంలో ఇంటర్నషిప్ చేస్తున్న సాల్మాజ్ మొహ్మది, జీనాబ్ మొహ్మది అనే ఇద్దరు ఇరాన్ మహిళలు తమ సొంత దేశం వెళ్లేందుకు సహాయపడాలని జిల్లా యంత్రాంగాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు బుధవారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం.విశ్వేశ్వరనాయుడిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఫార్మశీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఇద్దరు ఇరాన్ మహిళలు, పిల్లలతో నగరంలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఒకరికి ఇద్దరు పిల్లలు (7, 5 సంవత్సరాలు) మరో మహిళకు నాలుగేళ్ల వయస్సు ఉన్న బాలుడు ఉన్నారు. పిల్లలు నగరంలోని ప్రైవేటు స్కూలులో చదువుతున్నారు. అమెరికాతో యుద్ధం కారణంగా కొన్ని రోజుల నుంచి ఇరాన్లో గల కుటుంబ సభ్యులతో సంబంధాలు తెగిపోవడంతో అక్కడ నుంచి అవసరమైన డబ్బులు రాక నిలిచిపోయింది. దీంతో రెండు నెలల నుంచి ఇంటి అద్దె రూ.14,600, స్కూలు ఫీజులు రూ.29,700 బకాయిపడ్డారు. ఇంకా రోజువారీ ఇంటి నిర్వహణకు అవసరమైన డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్కు వచ్చి డీఆర్వోను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇంటర్నెషిప్ జూన్తో పూర్తవుతుందని, అప్పటిలోగా సొంత దేశం వెళ్లేందుకు సహకరించాలని, ఇంటి అద్దె, స్కూలు ఫీజులకు ఆర్థికంగా సాయం చేయాలని కోరారు. ఇంకా ఇరాన్లో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడించాలని వారి కోసం తాము ఎంతగానో ఆందోళన చెందుతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇరాన్ మహిళలు ఇచ్చిన వినతిపత్రాన్ని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.