ఇంటర్ పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:31 AM
జిల్లాలోని 11 మండలాల్లో సోమవారం ప్రారంభమైన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు.
అల్లూరి జిల్లాలో తొలి రోజు 4,468 మంది విద్యార్థులు హాజరు
259 మంది గైర్హాజరు
కంట్రోల్ రూమ్ నుంచి పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించిన డీఐఈవో
పాడేరురూరల్, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 11 మండలాల్లో సోమవారం ప్రారంభమైన మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్యాశాఖాధికారి ఎస్.భీమశంకరరావు తెలిపారు. 16 పరీక్షా కేంద్రాల్లో మొదటి రోజు జరిగిన తెలుగు పరీక్షకు 4,727 మంది జనరల్, ఒకేషనల్ విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 4,468 మంది హాజరయ్యారని, 259 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. పాడేరు, డుంబ్రిగుడ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను, పాడేరు, అరకు ఏపీఆర్ బాలికల కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు రాష్ట్ర పరిశీలకులు సుబ్రహ్మణ్యం సందర్శించి నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అనంతరం పాడేరు డీఐఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి పరీక్షా కేంద్రాలను డీఐఈవో, జిల్లా పరీక్షల కమిటీ ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారని చెప్పారు. పాడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ కె.సాహిత్ పరిశీలించారని ఆయన తెలిపారు.