పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం పనుల పరిశీలన
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:02 PM
సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఐదు, ఆరు యూనిట్ల పనులను విజయవాడ విద్యుత్ సౌద హైడెల్ డైరెక్టర్ సంజయ్ కుమార్ శనివారం పరిశీలించారు.
త్వరితగతిన పనులు చేయాలని
హైడెల్ డైరెక్టర్ సంజయ్ కుమార్ ఆదేశం
రూ.1.5 కోట్లతో పవన్ కెనాల్ మరమ్మతులు
సీలేరు, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): సీలేరు కాంప్లెక్స్ పరిధిలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఐదు, ఆరు యూనిట్ల పనులను విజయవాడ విద్యుత్ సౌద హైడెల్ డైరెక్టర్ సంజయ్ కుమార్ శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని దిగువ స్థాయి ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే డొంకరాయి పవర్ కెనాల్ రీచ్ వన్ రీచ్ టులో జరుగుతున్న నిర్వహణ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవర్ కెనాల్ మరమ్మతులకు రూ.1.5 కోట్లు కేటాయించి 20 మంది కాంట్రాక్టర్లకు అప్పగించామన్నారు. ఈ పనులు 20 రోజులుగా శరవేగంగా నిర్వహిస్తున్నామన్నారు. దిగువ సీలేరు డొంకరాయి 25 మెగావాట్ల సామర్థ్యం గల జలవిదుత్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ జరుగుతున్న క్యాపిటల్ ఓవరాయిలింగ్ పనులను త్వరితగతిని పూర్తిచేయాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట చీఫ్ ఇంజనీర్లు రాజారావు, రవీంద్రరెడ్డి, ఎస్ఈలు జాకీర్ హుస్సేన్, శ్రీనివాసరెడ్డి, ఈఈలు నాగశ్రీనివాసరావు, బాలకృష్ణ పాల్గొన్నారు.