గడువులోగా హైవే పనులు పూర్తి
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:25 AM
జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516-ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు.
హైవే అథారిటీ అధికారులకు కలెక్టర్ టి.నిశాంతి ఆదేశం
పాడేరు, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో జరుగుతున్న జాతీయ రహదారి 516-ఈ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. హైవే పనుల ప్రగతిపై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రోడ్డు నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని, ఈ క్రమంలో రాజీ పడవద్దని, నిబంధనలు ఉల్లంఘించవద్దని సూచించారు. అలాగే శాఖాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అందరి సమన్వయంతో పనులు జరిగేలా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్ అధికారులు, టీమ్ లీడర్లు నిత్యం పనులు పర్యవేక్షించాలన్నారు. రోడ్డు పనులు జరుగుతున్న క్రమంలో ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రధానంగా కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం గడువు నాటికి పనులు పూర్తి చేయకపోతే, దాని వలన ఎదురయ్యే సమస్యలు, చర్యలకు మీరే బాధ్యులవుతారని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఆర్డీవో ఎంవీఎస్ లోకేశ్వరరావు, ఏపీడీ నిధిచౌదరి, సైట్ ఇంజనీర్ లోకేశ్, టెక్నికల్ టీమ్ లీడర్లుశ్రీనివాస్, రవికుమార్, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
సమర్థవంతంగా ‘జలధార- జలహారతి’
జిల్లా భూగర్భ జలాల పెంపు, సంరక్షణలో భాగంగా ‘జలధార- జలహారతి’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ టి.నిశాంతి పేర్కొన్నారు. దీనిపై వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె మాట్లాడారు. జలధార- జలహారతి వంద రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్తో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించి సాగు నీటి వనరులను బలోపేతం చేయాలన్నారు. నీటి వనరులకు సాంకేతికత అనుసంధానం, భూగర్భ జలాల పెంపు, చెరువుల ఆధునికీకరణ వంటివి చేపట్టాలన్నారు. వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో చేపట్టాల్సిన చర్యలపై ఆయాశాఖల అధికారులు పక్కాగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ టి.శ్రీపూజ, ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, డీఆర్వో నీలకంఠరావు, జలవనరుల శాఖ ఈఈ ఆర్.రాజేశ్వరరావు, జిల్లా వ్యవసాయాధికారి ఎన్బీఎస్.నందు,. జిల్లా ఉద్యావనాధికారి కె.బాలకర్ణ, జలగణన శాఖ డీడీ శ్రీనివాస్, డ్వామా పీడీ విద్యాసాగరరావు, డీపీవో చంద్రశేఖర్, డీఎల్ పీవో పీఎస్.కుమార్, ఇన్చార్జి అటవీ అధికారి ఉమామహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.