మన్యంలో భారీ వర్షం
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:19 AM
మన్యంలో బుధవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తాజా వర్షంతో పంట పొలాల్లో నీరు చేరింది. జిల్లాలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సాధారణ వాతావరణం నెలకొని తర్వాత నుంచి వర్షం కొనసాగింది.
పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు
పంట పొలాల్లోకి చేరిన వర్షపు నీరు
పాడేరు, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): మన్యంలో బుధవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తాజా వర్షంతో పంట పొలాల్లో నీరు చేరింది. జిల్లాలో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సాధారణ వాతావరణం నెలకొని తర్వాత నుంచి వర్షం కొనసాగింది. దీంతో పాడేరు మండలంలోని మత్స్యగెడ్డ, రాయిగెడ్డ, చిలకలమామిడి గెడ్డ, పాడేరు, పెదబయలు మండలాలకు సరిహద్దున ఉన్న పరదానిపుట్టు గెడ్డ, జి.మాడుగుల మండలంలోని కోడిమామిడి గెడ్డ, మత్స్యగెడ్డ, ముంచంగిపుట్టు, పెదబయలు, అరకులోయ, డుంబ్రిగుడ మండలాల్లోని గెడ్డల ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం వాతావరణంతో మారుమూల ప్రాంత జనజీవనానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది వర్షాల కారణంగా గెడ్డలు పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గెడ్డలు దాటవద్దని అధికారులు కోరుతున్నారు. అయితే తాజా భారీ వర్షాలు ఏజెన్సీలోని మెట్ట పంటలకు జీవం పోస్తాయని రైతులు అంటున్నారు.
పెదబయలులో...
పెదబయలు: మండలంలోని పలు ప్రాంతాల్లో బుధవారం కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగా ఉండి తేలికపాటి ఎండ కాసింది. మఽద్యాహ్నం మూడున్నర గంటల తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని మేఘాలు కమ్ముకున్నాయి. సాయంత్రం నాలుగు గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు చిత్తడిగా మారాయి. డ్రైనేజీ లేకపోవడంతో ప్రధాన రహదారి అంచుల్లో వర్షపు నీరు నిలిచింది. వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కాగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.