భారీ వర్షం
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:45 AM
అనకాపల్లి పట్టణంతోపాటు కశింకోట, అనకాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములతో భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల రహదారులు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ చెరువును తలపించింది. విజయరామరాజుపేట రైల్వే అండర్బ్రిడ్జి కింద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
అనకాపల్లిలో లోతట్టు ప్రాంతాలు జలమయం
పొంగిన డ్రైనేజీలు.. రోడ్లపై చెత్తాచెదారం
అనకాపల్లి టౌన్/ కొత్తూరు/ కశింకోట, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి పట్టణంతోపాటు కశింకోట, అనకాపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఉరుములతో భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాల రహదారులు జలమయమయ్యాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణ చెరువును తలపించింది. విజయరామరాజుపేట రైల్వే అండర్బ్రిడ్జి కింద నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనాలను లక్ష్మీదేవిపేట రైల్వే గేటు మీదుగా మళ్లించారు. డ్రైనేజీ కాలువలు పొంగడంతో మురుగుతో చెత్తాచెదారం రహదారులపై పేరుకుపోయింది. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బంది పడ్డారు. గత రెండు రోజుల నుంచి సాయంత్రం పూట ఆకాశం మేఘావృతం అవుతున్నప్పటికీ వర్షం కురవలేదు. కాగా శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత, ఉక్కపోతతో ఇబ్బంది పడిన జనం.. అనంతరం వర్షం కురిసి వాతావరణం చల్లబడడంతో ఉపశమనం చెందారు.