అసంపూర్తి దారితో అవస్థలు
ABN , Publish Date - Jun 14 , 2026 | 12:58 AM
మండల కేంద్రం నుంచి గుడ్డిప వరకు రహదారి రాళ్లు తేలి దారుణంగా ఉండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాపోతున్నారు.
- రాళ్లు తేలి ఉండడంతో వాహనాల రాకపోకలకు అవాంతరాలు
రావికమతం, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రం నుంచి గుడ్డిప వరకు రహదారి రాళ్లు తేలి దారుణంగా ఉండడంతో వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని వాపోతున్నారు.
మండలంలోని రావికమతం నుంచి తోటకూరపాలెం వరకు ఉన్న ఆర్ఈసీ రోడ్డు 16 కిలో మీటర్ల మేర ఉంది. రావికమతం, దాసరయ్యపాలెం, గుడివాడ, పిల్లవానిపాలెం, గొంప, గుడ్డిప, తట్టబంద, తోటకూరపాలెం తదితర 20 గ్రామాలకు ఇది ప్రధాన రహదారి. ఇటు అనకాపల్లి, కశింకోట, మాకవరపాలెం, రావికమతం మండలాలను కలిపే ఈ రోడ్డుపై క్వారీ లారీలు, మెటల్ రాళ్ల లారీలు, సరుగుడు లోడుల లారీల భారీ లోడుతో వెళ్లడంతో పూర్తిగా ధ్వంసమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు చొరవతో ఆర్ఈసీ రోడ్డు అభివృద్ధికి రూ.మూడు కోట్లు మంజూరయ్యాయి. దీంతో 2026 జనవరిలో రావికమతం నుంచి గుడ్డిప వరకు ఆరు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రావికమతం నుంచి గుడ్డిప వరకు మెటల్ పరిచారు. ఆపై రెండు లేయర్ల తారు నిర్మాణం చేయాల్సి ఉండగా పశ్చిమాసియా యుద్ధం కారణంగా తారు ధర అమాంతం పెరిగింది. దీంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ప్రస్తుతం రాళ్లు తేలిన రహదారిలో ప్రయాణం నరకప్రాయంగా ఉంది. ఈ రోడ్డు ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి ఉంది. ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనచోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.