ఉక్కు అమ్మకాల్లో వృద్ధి
ABN , Publish Date - Jan 03 , 2026 | 12:26 AM
స్టీల్ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్) 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నెలాఖరు నాటికి రూ.16,360 కోట్ల విలువైన స్టీల్ను విక్రయించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు త్రైమాసికాల్లో రూ.16,360 కోట్ల విక్రయాలు
గత ఏడాది ఇదే కాలంలో రూ.12,615 కోట్లు...
విశాఖపట్నం, జనవరి 2 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ప్లాంటు (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్) 2025-26 ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు నెలాఖరు నాటికి రూ.16,360 కోట్ల విలువైన స్టీల్ను విక్రయించింది. సుమారు 23.7 లక్షల టన్నుల స్టీల్ అమ్మకాల ద్వారా ఈ మొత్తం సమకూరింది. గత ఏడాది (2024-25) ఇదే కాలానికి కేవలం రూ.12,615 కోట్లు మాత్రమే అమ్మకాలు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరం ఆర్థిక ఇబ్బందుల వల్ల ముడి పదార్థాలు అవసరమైనన్ని సమకూర్చుకోలేక మూడు బ్లాస్ ఫర్నేసుల్లో ఒకటి పూర్తిగా మూతపడడం, మిగిలిన రెండింటి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఉత్పత్తి రాకపోవడం వల్ల అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. దాంతో సంస్థకు నష్టాలు పెరిగాయి. ఈ దుస్థితి నుంచి గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్లు ఆర్థిక సాయం చేయడంతో పుంజుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ నుంచి మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్ను తిరిగి వినియోగంలోకి తీసుకువచ్చింది. దాంతో ఉత్పత్తితో పాటు అమ్మకాలు కూడా పెరిగాయని ఉక్కు వర్గాలు తెలిపాయి.