భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యత
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:07 AM
తాగు, సాగునీటి అవసరాలతో పాటు భావితరాల కోసం భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యతగా భావించాలని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు.
కలెక్టర్ టి.నిశాంతి
కలెక్టరేట్లోని పలు విభాగాలు, కార్యాలయాల సందర్శన
పాడేరు, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): తాగు, సాగునీటి అవసరాలతో పాటు భావితరాల కోసం భూగర్భ జలాల సంరక్షణ అందరి బాధ్యతగా భావించాలని కలెక్టర్ టి.నిశాంతి అన్నారు. పాడేరు మండలం తుంపాడ గ్రామంలో ‘నీటి భద్రత- సాగునీటి సంఘాల బాధ్యత’ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన సభలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నీటి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన ఏర్పరచుకోవాలని, భూగర్భ జలాల సంరక్షణతోనే అది సాధ్యమవుతుందన్నారు. అలాగే సాగునీటి సంఘాలు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా అధికారులు సూచించే వాటిని విఽధిగా పాటించాలని, భూగర్భ జలాలను పెంచేందుకు కృషి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణపై ప్రజలు, సాగునీటి సంఘాలు, జలవనరుల శాఖ, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలన్నారు. 2014- 19లో సీఎం చంద్రబాబునాయుడు నీరు- చెట్టు పథకంలో భాగంగా నీటి వనరుల సంరక్షణ, సాగునీరు సద్వినియోగానికి బాటలు వేశారని గిడ్డి ఈశ్వరి గుర్తు చేశారు. అంతకు ముందు తుంపాడ పెద్ద చెరువును అందరిరితో కలిసి కలెక్టర్ నిశాంతి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో టి.శ్రీపూజ, జల వనరుల శాఖ ఈఈ ఈఈ ఆర్.రాజేశ్వరరావు, డీఈఈ నాగేశ్వరరావు, డ్వామా పీడీ విద్యాసాగరరావు, తహశీల్దార్ అరుణ్చంద్ర, జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, పీఏసీఎస్ పర్సన్ ఇన్చార్జి డప్పోడి వెంకటరమణ, ఎంపీపీ ఎస్.రత్నకుమారి, మాజీ ఎంపీపీ బొర్రా విజయరాణి, సర్పంచ్ లకే పార్వతమ్మ, గిరిజన రైతులు పాల్గొన్నారు.
కలెక్టరేట్లో పలు విభాగాల సందర్శన
కలెక్టర్ టి.నిశాంతి సోమవారం కలెక్టరేట్లోని పలు విభాగాలు, అక్కడున్న పలు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. కలెక్టరేట్ పరిపాలనా విభాగానికి వచ్చి అక్కడ అధికారులు, ఉద్యోగులను పరిచయం చేసుకుని, తర్వాత పీజీఆర్ఎస్, ఇతర విభాగాలతోపాటు ముఖ్య ప్రణాళికా విభాగం, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, పౌర సరఫరాలు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ల్యాండ్ సర్వే, డీపీఆర్వో, తదితర కార్యాలయాలను సందర్శించారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలని, ఫైళ్లు, రికార్డులను పక్కాగా భద్రపరచాలని అధికారులు, ఉద్యోగులకు ఆమె సూచించారు. అలాగే మండలంలో గుత్తులపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాల, కుమ్మరిపుట్టులోని మోడల్ ప్రైమరీ పాఠశాలను కలెక్టర్ సందర్శించి బాలికలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ, ఐటీడీఏ పీవో తిరుమాని శ్రీపూజ, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పీబీకే పరిమిళ, ఏటీడబ్ల్యూవో అఖిల, హెచ్ఎంలు, టీచర్లు పాల్గొన్నారు.