Share News

15న సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు భూమి పూజ

ABN , Publish Date - Aug 12 , 2026 | 12:29 AM

సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు కావడంతో ఈ నెల 15న భూమి పూజ చేసి మొదటిగా ఇంటెక్‌ పనులను ప్రారంభిస్తామని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక జెన్‌కో అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణం, అటవీశాఖ అనుమతులు పూర్తిస్థాయిలో వచ్చాయన్నారు.

15న సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు భూమి పూజ
సీలేరు రెగ్యులేటర్‌ డ్యాంను స్థానిక ఇంజనీర్లతో కలిసి పరిశీలిస్తున్న జెన్‌కో సీఈ కేవీ రాజారావు

- అనుమతులు రావడంతో మొదటిగా ఇంటెక్‌ పనులు

- ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు సీఈ కేవీ రాజారావు

సీలేరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సీలేరు పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు కావడంతో ఈ నెల 15న భూమి పూజ చేసి మొదటిగా ఇంటెక్‌ పనులను ప్రారంభిస్తామని ఏపీ జెన్‌కో సీలేరు కాంప్లెక్సు చీఫ్‌ ఇంజనీర్‌ కేవీ రాజారావు తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక జెన్‌కో అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పర్యావరణం, అటవీశాఖ అనుమతులు పూర్తిస్థాయిలో వచ్చాయన్నారు. సెప్టెంబరు నెలాఖరులోగా ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి కార్యరూపం తీసుకొచ్చి కలెక్టర్‌ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఏపీ జెన్‌కో మేనేజ్‌మెంట్‌ దాన్ని పరిశీలించి నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనలు, ఆర్‌అండ్‌ఆర్‌ యాక్టు ప్రకారం అన్నీ సమకూర్చి స్టేజ్‌-1, స్టేజ్‌- 2 ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని తెలిపారు. కాగా సీలేరు కాంప్లెక్సులో 10 ఎకరాల్లో మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఆదేశించారని, నిర్దేశించిన సమయానికి ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. ప్రస్తుతం మాచ్‌ఖండ్‌లో ఒకటి, రెండు యూనిట్ల ద్వారా నిరాటంకంగా విద్యుదుత్పత్తి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొని జోలాపుట్‌లో తక్కువగా నీటి నిల్వలు ఉన్నాయని, ఉన్న నీటి నిల్వలతోనే మాచ్‌ఖండ్‌లో విద్యుదుత్పత్తి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో సీలేరు కాంప్లెక్సు ఎస్‌ఈ(సివిల్‌) జాకీర్‌ హుస్సేన్‌, ఈఈ టి.అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 12 , 2026 | 12:29 AM