నగరానికి చేరుకున్న గవర్నర్, హైకోర్టు చీఫ్ జస్టిస్
ABN , Publish Date - Feb 17 , 2026 | 01:43 AM
ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ థీరజ్సింగ్ ఠాగూర్ సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు.
గోపాలపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
ఐఎఫ్ఆర్ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, హైకోర్టు చీఫ్ జస్టిస్ థీరజ్సింగ్ ఠాగూర్ సోమవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. వీరికి విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రతబాగ్చీ స్వాగతం పలికారు.
ఉక్కు ఉద్యోగులకు నోటీసులు
సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న 146 మందికి జారీ
మరోసారి తప్పు చేస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక
విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
స్టీల్ ప్లాంటు యాజమాన్యం 146 మంది ఉద్యోగులకు హెచ్చరిక నోటీసులు జారీచేసింది. ఈ నెల 12న నిర్వమించిన సార్వత్రిక సమ్మెలో స్టీల్ ప్లాంటు ఉద్యోగులు కూడా కొందరు పాల్గొన్నారు. వారందరినీ గుర్తించి ఆ మరుసటి తేదీతో సోమవారం విడివిడిగా నోటీసులు జారీచేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు, కార్మికులు అంతా స్టీల్ప్లాంటు అభివృద్ధికి పాటుపడాలని సమ్మెలు, నిరసనలు వ్యక్తం చేయకూడదని సీఎండీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని అందులో గుర్తుచేసింది. సమ్మెలో పాల్గొనడం యాజమాన్యానికి వ్యతిరేకంగా పనిచేయడం కిందకే వస్తుందని స్పష్టంచేసింది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. షోకాజ్ నోటీసుకు ఎక్కువగా, మెమోకు తక్కువగా ఈ నోటీసు ఉందని ఉద్యోగ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీటిని అందుకున్నవారు ఇకపై చిన్న తప్పు చేసినా ఉద్యోగం నుంచి తొలగించడానికి కూడా యాజమాన్యం వెనుకాడదనే వాదన వినిపిస్తోంది.
ఆరు గంటలు ఆగిన విద్యుత్ సరఫరా
స్టీల్ప్లాంటును ముడి పదార్థాల కొరత వేధిస్తోంది. బొగ్గుతో పాటు కోక్ కూడా తగినంత అందడం లేదు. సొంత ఽథర్మల్ పవర్ ప్లాంటులో సాంకేతిక లోపాలు తలెత్తడంతో విద్యుత్ కోసం పూర్తిగా రాష్ట్ర గ్రిడ్పై ఆధారపడుతున్నారు. సోమవారం ఉదయం సుమారుగా ఆరు గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఉద్యోగ వర్గాలు తెలిపాయి. ఈ ప్రభావం ఉత్పత్తిపై పడింది. సింటర్ ప్లాంటులో రెండు మిషన్లు ఆగిపోయాయి. తగినన్ని వృథా వాయువులు అందక రోలింగ్ మిల్స్ కూడా నిలిచిపోయాయి. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఉత్పత్తి బాగా తగ్గిపోవడంతో ఉద్యోగులకు 70 శాతానికి మించి జీతాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. పూర్తిస్థాయిలో ముడి పదార్థాలు సరఫరాపై ఉన్నత వర్గాలు దృష్టిపెట్టాలనే డిమాండ్ వినిపిస్తోంది.
భక్తజన సంద్రం
శివరాత్రి రోజు మరుసటిరోజు సముద్ర స్నానాలకు తరలివచ్చిన భక్తులు
బీచ్లలో కోలాహలం
విశాఖపట్నం, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి):
మహాశివరాత్రిని పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి జాగారం చేసిన భక్తులు సోమవారం ఉదయం సముద్ర స్నానాలను భారీగా తరలిరావడంతో ఆర్కే బీచ్, రుషికొండ, భీమిలి బీచ్లు కోలాహలంగా కనిపించాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. భీమిలి వద్ద గోస్తనీ సాగర సంగమ ప్రదేశంలో భారీగా భక్తులు సముద్ర స్నానాలను ఆచరించారు.