ఏలేరు కాలువలోకి గోదావరి జలాలు
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:23 AM
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి విడుదలైన గోదావరి జలాలు ఎట్టకేలకు ఏలేరు కాలువలోకి ప్రవేశించాయి.
తాళ్లపాలెం వద్ద పోలవరం కాలువ నుంచి అనుసంధానం
అనకాపల్లి/కశింకోటం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి విడుదలైన గోదావరి జలాలు ఎట్టకేలకు ఏలేరు కాలువలోకి ప్రవేశించాయి. అధికారులు సోమవారం తాళ్లపాలెం వద్ద గోదావరి జలాలను ఏలేరు కాలువలోకి అనుసంధానం చేశారు. దీని నుంచి గోదావరి జలాలు విశాఖకు వెళతాయి. పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు సుమారు 52 కిలోమీటర్ల మేర కాలువలో నీటి ప్రవాహాన్ని నాలుగు రోజులపాటు పరిశీలించిన అనంతరం సోమవారం ఏలేరు కాలువలోకి నీటిని మళ్లించినట్టు పోలవరం ప్రాజెక్టు డీఈ డి.భాస్కర్ రామకృష్ణ తెలిపారు. తాళ్లపాలెం వద్ద పోలవరం కాలువ, ఏలేరు కాలువ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అంచెలు అంచెలుగా నీటిని వదులుతున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువను ఏలేరు కాలువకు అనుసంధానం చేయడంతో ఏలేరు రిజర్వాయర్ నుంచి కాలువకు నీటి విడుదలను క్రమబద్ధీకరించినట్టు డీఈ వెల్లడించారు. కాలువకు ఇంకా సిమెంట్ లైనింగ్ జరగని ప్రదేశాల్లో గట్ల నుంచి లీకేజీలు, గట్లు కోతకు గురై గండిపడడం వంటి వాటికి ఆస్కారం లేకుండా తమ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
పోలవరం కాలువలోకి దిగొద్దు
పోలవరం ఎడమ ప్రధాన కాలువలో నీటి ప్రవాహం అధికంగా వున్నందున ప్రజలెవరూ కాలువలోకి దిగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గోదావరి పవిత్ర జలాలు అన్న ఉద్దేశంతో పుణ్యస్నానాలు ఆచరించే ప్రయత్నం చేయొద్దని, అదే విధంగా ఈత కొట్టడం, సరదాగా కాలువలోకి దిగడం వంటి పనులు చేయొద్దని స్పష్టం చేశారు. గ్రామాల వద్ద కాలువ గట్టుపైకి చిన్నపిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా వుండాలని సూచిస్తున్నారు. కాలువలో నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో పశువులను సైతం కాలువలోకి దించవద్దని స్పష్టంచేశారు.
పోలవరం కాలువలో పెరిగిన నీటి ఉధృతి
ఎలమంచిలి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఎలమంచిలి మండల పరిధిలో పోలవరం ఎడమ ప్రధాన కాలువలో సోమవారం నీటి ఉధృతి పెరిగింది. చిన్నపాటి నది తరహాలో ప్రవహిస్తున్న పోలవరం కాలువను పలు గ్రామాల ప్రజలు ఆశ్చర్యంతోపాటు ఆనందంతో తిలకిస్తున్నారు. రెండు రోజుల క్రితం మూడు అడుగుల లోతున మాత్రమే ప్రవహించిన నీరు.. సోమవారం పది అడుగులకు పెరిగింది. కాలువ సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేస్తే 15 అడుగులకుపైగా వుంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా పోలవరం కాలువలో నీటి ప్రవాహం పెరిగిందని, అందువల్ల ప్రజలెవరూ కాలువలో దిగవద్దని, అదే విధంగా పశువులను కాలువలోకి వదలొద్దని ఎలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర హెచ్చరికలు జారీ చేశారు.