ఏలేరులోకి గోదావరి
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:04 AM
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఎట్టకేలకు ఏలేరు కాలువలోకి ప్రవేశించాయి.
తాళ్లపాలెం వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి విడుదల
నేడు కణితి బ్యాలెన్సింగ్కు చేరిక
అక్కడ నుంచి నరవ ట్రీట్మెంట్ ప్లాంటుకు పంపింగ్
అనంతరం నగరవాసుల తాగునీటి అవసరాలకు సరఫరా
అనకాపల్లి/కశింకోటం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి):
పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా గోదావరి జలాలు ఎట్టకేలకు ఏలేరు కాలువలోకి ప్రవేశించాయి. అధికారులు సోమవారం తాళ్లపాలెం వద్ద గోదావరి జలాలను ఏలేరు కాలువలోకి అనుసంధానం చేశారు. ఏలేరు కాలువ ద్వారా గోదావరి జలాలు విశాఖకు చేరతాయి. పాయకరావుపేట నుంచి తాళ్లపాలెం వరకు సుమారు 52 కిలోమీటర్ల మేర పోలవరం ఎడమ కాలువలో నీటి ప్రవాహాన్ని నాలుగు రోజులపాటు పరిశీలించిన అనంతరం సోమవారం ఏలేరు కాలువలోకి మళ్లించినట్టు పోలవరం ప్రాజెక్టు డీఈ డి.భాస్కర్ రామకృష్ణ తెలిపారు. తాళ్లపాలెం వద్ద పోలవరం కాలువ, ఏలేరు కాలువలను జాగ్రత్తగా పరిశీలిస్తూ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అంచెలు అంచెలుగా నీటిని వదులుతున్నట్టు చెప్పారు. పోలవరం ఎడమ కాలువను ఏలేరు కాలువకు అనుసంధానం చేయడంతో ఏలేరు రిజర్వాయర్ నుంచి కాలువకు నీటి విడుదలను క్రమబద్ధీకరించినట్టు డీఈ వెల్లడించారు. కాలువకు ఇంకా సిమెంట్ లైనింగ్ జరగని ప్రదేశాల్లో గట్ల నుంచి లీకేజీలు, గట్లు కోతకు గురై గండిపడడం వంటి వాటికి ఆస్కారం లేకుండా తమ సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
నేడు కేబీఆర్కు గోదావరి నీరు
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి సోమవారం ఉదయం ఏలేరు కాలువలోకి విడిచిపెట్టిన గోదావరి నీరు మంగళవారం ఉదయానికి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లోకి ప్రవేశించనున్నాయి. తాళ్లపాలెం నుంచి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 33 కిలోమీటర్ల దూరం ఉంది. కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి జీవీఎంసీ అధికారులు మోటార్ల ద్వారా నరవ ట్రీట్మెంట్ ప్లాంటుకు పంపింగ్ చేస్తారు. దశల వారీగా మేహాద్రిగెడ్డకు, అక్కడ నుంచి ముడసర్లోవ రిజర్వాయర్కు పంపింగ్ చేస్తారు.
పోలవరం కాలువలోకి దిగొద్దు
నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున ప్రజలెవరూ పోలవరం ఎడమ ప్రధాన కాలువలోకి దిగొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. గోదావరి జలాలు అన్న ఉద్దేశంతో పుణ్యస్నానాలు ఆచరించే ప్రయత్నం చేయొద్దని, అదేవిధంగా ఈత కొట్టడం, సరదాగా కాలువలోకి దిగడం వంటి పనులు చేయొద్దని స్పష్టం చేశారు. గ్రామాల వద్ద కాలువ గట్టుపైకి చిన్నపిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
పోలవరం కాలువలో పెరిగిన నీటి ఉధృతి
పోలవరం ఎడమ ప్రధాన కాలువలో సోమవారం నీటి ఉధృతి పెరిగింది. ఎలమంచిలి మండల పరిధిలో చిన్నపాటి నది తరహాలో ప్రవహిస్తున్న పోలవరం కాలువను పలు గ్రామాల ప్రజలు ఆశ్చర్యంతోపాటు ఆనందంతో తిలకిస్తున్నారు. రెండు రోజుల క్రితం మూడు అడుగుల లోతున మాత్రమే ప్రవహించిన నీరు...సోమవారం పది అడుగులకు పెరిగింది. కాలువ సామర్థ్యం మేరకు నీటిని విడుదల చేస్తే 15 అడుగులకుపైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.