పిడుగుపాటుకు బాలిక మృతి
ABN , Publish Date - May 05 , 2026 | 12:43 AM
ఆకు కూర సేకరణకు కొండకు వెళ్లిన ఒక బాలికపై సోమవారం పిడుగు పడడంతో మృతి చెందింది. దీనికి సంబంధించి బాలిక తండ్రి కోగేష్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
డుంబ్రిగుడ, మే 4(ఆంధ్రజ్యోతి): ఆకు కూర సేకరణకు కొండకు వెళ్లిన ఒక బాలికపై సోమవారం పిడుగు పడడంతో మృతి చెందింది. దీనికి సంబంధించి బాలిక తండ్రి కోగేష్ తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. కండ్రుం పంచాయతీ సిందేరిగుడ గ్రామానికి చెందిన ఎస్.దివ్య(13) తన అక్క, స్నేహితురాలితో కలిసి కొంకోడి కూర (ఆకు కూర) సేకరణ నిమిత్తం కొండకు వెళ్లింది. సోమవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆ సమయంలో తిరిగి ఇంటికి వస్తున్న దివ్యపై పిడుగు పడడంతో కుప్పకూలిపోయింది. ఆ బాలికను 108 వాహనంలో డుంబ్రిగుడ పీహెచ్సీకి తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. దివ్య డుంబ్రిగుడలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. ఆ బాలిక మృతితో సిందేరిగుడ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.