విలువిద్యకు సంపూర్ణ ప్రోత్సాహం
ABN , Publish Date - Jul 27 , 2026 | 11:26 PM
మన్యంలో విలువిద్యకు ప్రభుత్వపరంగా సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తామని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి
పాడేరులో జిల్లా స్థాయి విలువిద్య క్రీడా పోటీలు ప్రారంభం
పాడేరు, జూలై 27(ఆంధ్రజ్యోతి): మన్యంలో విలువిద్యకు ప్రభుత్వపరంగా సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తామని రాష్ట్ర హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పాడేరులో సోమవారం సాయంత్రం జిల్లా స్థాయి విలువిద్య క్రీడా పోటీలను వారు ప్రారంభించి మాట్లాడారు. విలువిద్య కేవలం క్రీడ మాత్రమే కాదని, గిరిజనులకు వారసత్వంగా వస్తున్న సంప్రదాయమన్నారు. గిరిజన యువత విలువిద్యలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని, అందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. విలువిద్యతో గిరిజన ప్రాంతానికి ప్రపంచ స్థాయి కీర్తిని సంపాదించాలని ఆకాంక్షించారు. అనంతరం ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ, కలెక్టర్ టి.నిషాంతి, ఎస్పీ అమిత్బర్దార్, జాయింట్ కలెక్టర్ టి.శ్రీపూజ, తదితరులు మాట్లాడారు.
గంజాయి రహత సమాజానికి కృషి
గంజాయి రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. స్థానిక తలారిసింగి ఆశ్రమ పాఠశాల ఆవరణలో సోమవారం రాత్రి సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్స్తో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణితో కలిసి ఆమె మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాఽల వల్ల కలిగే అనర్థాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి మెరుగైన సమాజం కోసం కృషి చేయాలన్నారు. ప్రజలకు ప్రయోజనం కలిగే మంచి కంటెంట్లతో వీడియోలు చేసి ప్రజలను చైతన్యం చేయాలన్నారు. జిల్లాలో ఈగల్ టీమ్ చేస్తున్న కృషికి సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్లు తోడ్పాటునందించి, వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్పై సమాచారం అందించే టోల్ ఫ్రీ నంబర్ 1972ను మంత్రులు, అధికారులు ప్రదర్శించారు. అనంతరం సోషల్ మీడియా ఇన్ప్లూయేన్సర్స్తో హోం మంత్రి అనిత సెల్ఫీ దిగారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ ఆకే.రవికృష్ణ, కలెక్టర్ టి.నిషాంతి, ఎస్పీ అమిత్బర్దార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మకత అకాడమీ చైర్మన్ వంపూరు గంగులయ్య, ఈగల్ బృందం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.