ఫ్రై డే భానుడి భగభగలు
ABN , Publish Date - Apr 25 , 2026 | 01:07 AM
భానుడి ప్రతాపం నానాటికీ పెరిగిపోతున్నది. ఏప్రిల్ చివరి వారంలోనే జిల్లాలో పగటి ఉష్ణోగత్రలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం సగం మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతున్నది.
సగం మండలాల్లో 40 డిగ్రీలకుపైబడి ఉష్ణోగ్రతలు నమోదు
దేవరాపల్లిలో అత్యధికంగా 43.3 డిగ్రీలు..
అనకాపల్లి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): భానుడి ప్రతాపం నానాటికీ పెరిగిపోతున్నది. ఏప్రిల్ చివరి వారంలోనే జిల్లాలో పగటి ఉష్ణోగత్రలు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం సగం మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతున్నది. ఉదయం పది గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు వేడిగాలులు తగ్గడంలేదు. దీంతో మధ్యాహ్నం వేళ జనం ఇళ్లకే పరిమితం కావడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఆరు బయట కూలి పనులకు వెళ్లే వారు వేడి వాతావరణం, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. శుక్రవారం దేవరాపల్లి మండలంలో అత్యధికంగా 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగిలిన మండలాలను పరిశీలిస్తే.. చీడికాడలో 42.3 డిగ్రీలు, నర్సీపట్నంలో 42.8, మాడుగులలో 41,9, నాతవరంలో 42.1, బుచ్చెయ్యపేటలో 40.7, చోడవరంలో 40.2, కె.కోటపాడులో 40.2, కశింకోటలో 40.1, మాకవరపాలెంలో 41.1, రావికమతంలో 40.7, రోలుగుంటలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక అనకాపల్లిలో 37.9 డిగ్రీలు, అచ్యుతాపురంలో 34.5, గొలుగొండలో 39.9, కోటవురట్లలో 38.7, మునగపాకలో 37.4, నక్కపల్లిలో 35.8, పరవాడలో 31.8, పాయకరావుపేటలో 36.5, రాంబిల్లిలో 34.4, ఎస్.రాయవరంలో 36.6, సబ్బవరంలో 38.3, ఎలమంచిలిలో 36.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నీరు ఎక్కువగా తాగాలని, బయటకు వెళ్లినప్పుడు వెంట వాటర్ బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకెళ్లాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.