టెన్త్ విద్యార్థులకు ఉచిత బస్సులు
ABN , Publish Date - Mar 15 , 2026 | 10:56 PM
పదో తరగతి విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత బస్సులను నడుపుతున్నామని ప్రజారవాణా సంస్థ పాడేరు డిపో మేనేజర్ పి.శ్రీనివాసరావు తెలిపారు.
హాల్ టిక్కెట్ చూపిస్తే ఫ్రీ
గురుకుల విద్యార్థులకు 9 ప్రత్యేక బస్సులు
పాడేరు డిపో మేనేజర్ శ్రీనివాసరావు
పాడేరురూరల్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి విద్యార్థులకు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు ఉచిత బస్సులను నడుపుతున్నామని ప్రజారవాణా సంస్థ పాడేరు డిపో మేనేజర్ పి.శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పల్లె వెలుగు బస్సులను కూడా టెన్త్ విద్యార్థులు వినియోగించుకోవచ్చునన్నారు. రెగ్యులర్గా నడిచే పల్లెవెలుగు బస్సులలో పదో తరగతి విద్యార్థులు హాల్ టిక్కెట్ చూపిస్తే ఉచితంగా ప్రయాణం చేయవచ్చని తెలిపారు. అదే బాలికలు అయితే హాల్ టిక్కెట్తో పనిలేకుండా ఆధార్ చూపించి కూడా స్త్రీశక్తి పథకం ద్వారా ఉచితంగా టిక్కెట్ పొందవచ్చనన్నారు. అయితే 9 ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలలకు ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నామన్నారు. కొయ్యూరు గురుకుల పాఠశాలకు ఒక బస్సు, పెదబయలుకు 1, పాడేరు 1, అరకులోయ రవ్వలగూడ టీడబ్ల్యూఏహెచ్ స్కూల్కు 1, జి.మాడుగుల 1, అనంతగిరి 1, అరకులోయ ఏపీటీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాలకు 3 బస్సులను కేటాయించామన్నారు. ఇక్కడ విద్యార్థులను పాఠశాలల నుంచి పరీక్షా కేంద్రాలకు, పరీక్ష అయిన తర్వాత వారిని పాఠశాలల వద్దకు తీసుకువస్తామన్నారు. ఇందుకోసం జిల్లాలో 9 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామన్నారు. ఏ విద్యా సంస్థ అయినా బస్సులు కావాలంటే తమ డిపోలో మాట్లాడి నిర్ణయించిన అద్దె చెల్లిస్తే పాఠశాల నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తామని డీఎం శ్రీనివాసరావు తెలిపారు.