అడవికి నిప్పు
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:00 AM
అల్లూరి మన్యంలో అడవికి నిప్పు పెట్టారు. సీలేరు-దుప్పిలివాడ రహదారిలో అడవికి దుండగులు శుక్రవారం నిప్పు పెట్టారు.
సీలేరు-దుప్పిలివాడ రోడ్డు పక్కనే నిప్పు పెట్టిన దుండగులు
అడవిలో వ్యాపించిన మంటలు
సీలేరు, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి):అల్లూరి మన్యంలో అడవికి నిప్పు పెట్టారు. సీలేరు-దుప్పిలివాడ రహదారిలో అడవికి దుండగులు శుక్రవారం నిప్పు పెట్టారు. వేల హెక్టార్లకు మంటలు వ్యాపించాయని గిరిజనులు చెబుతున్నారు. అడవులకు నిప్పు పెట్టరాదని గ్రామ గ్రామాన అటవీ శాఖ అధికారులు ఫ్లెక్సీలను పెట్టి గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే శుక్రవారం సీలేరు అటవీ శాఖ రేంజ్ పరిధిలో గల సీలేరు-దుప్పిలివాడ రహదారిలో దుండగులు అడవికి నిప్పుపెట్టారు. వేసవి కాలం కావడంతో నేల రాలిన ఆకులు అంటుకొని వేల హెక్టార్ల అడవికి మంటలు చుట్టుకున్నాయి. దీంతో విలువైన అటవీ సంపద కాలి బూడిద అవుతున్నది. రోడ్డు పక్కకు మంటలు వ్యాపించాయి. దీంతో ఈ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు వేడిసెగలతోపాటు పొగ బూడిద కళ్లల్లోకి వెళ్లి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ అడవిలో కొండ గొర్రెలు, కొండ మేకలు, కొండముచ్చులు, కోతులు, దుప్పులు, ఎలుగుబంట్లు, నక్కలు, కుందేళ్లు, ఇలా ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. వీటి మనుగడకు ప్రమాదం పొంచి ఉంది.