పీజీఆర్ఎస్ అర్జీలకు ప్రథమ ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 08 , 2026 | 11:55 PM
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజలు అందించే అర్జీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులకు ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశం
అనకాపల్లి కలెక్టరేట్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజలు అందించే అర్జీలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజయకృష్ణన్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ విజయకృష్ణన్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్కు 138, రెవెన్యూ క్లినిక్కు 143 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్జీల క్లియరెన్స్ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అన్నారు. బాధ్యతగా తీసుకొని అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో..
అనకాపల్లి రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఎస్పీ తుహిన్ సిన్హా పాల్గొని ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మొత్తం 54 అర్జీలు అందాయి. పలువురి సమస్యలను ఎస్పీ స్వయంగా తెలుసుకొని వాటిని సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పీజీఆర్ఎస్లో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ విషయంలో అలసత్వాన్ని సహించేది లేదని స్పష్టం చేశారు.