నర్సింగ్ కళాశాల హాస్టల్లో మంటలు
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:47 AM
మండలంలోని కొండలఅగ్రహారం ఇమ్మాన్యూయేలు నర్సింగ్ కళాశాల హాస్టల్లో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్సర్క్యుట్ కారణంగా ప్రమాదం సంభవించడంతో విద్యార్థినుల పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ విద్యార్థినులు సురక్షితంగా బయటపడ్డారు.
షార్ట్సర్క్యూట్తో అగ్ని ప్రమాదం
కాలిపోయిన విద్యార్థినుల పుస్తకాలు, దుస్తులు, సామగ్రి
మాకవరపాలెం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండలఅగ్రహారం ఇమ్మాన్యూయేలు నర్సింగ్ కళాశాల హాస్టల్లో మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్సర్క్యుట్ కారణంగా ప్రమాదం సంభవించడంతో విద్యార్థినుల పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి కాలి బూడిదయ్యాయి. అదృష్టవశాత్తూ విద్యార్థినులు సురక్షితంగా బయటపడ్డారు.
నర్సింగ్ కళాశాల వసతిగృహంలో సుమారు 50 మంది విద్యార్థినులు వుంటున్నారు. ఆదివారం కళాశాలకు సెలవు కావడంతో అందరూ హాస్టల్లోనే వున్నారు. తొమ్మిది గంటల తరువాత ఆరుగురు మినహా మిగిలిన వారు సమీపంలోని చర్చికి వెళ్లారు. సుమారు పది గంటల సమయంలో ఓవర్ హెడ్ ట్యాంకులో నీరు అయిపోవడంతో విద్యార్థినులు మోటారును ఆన్చేశారు. ఈ క్రమంలో విద్యుత్ షార్ట్సర్క్యూట్ ఏర్పడి ఒక్కసారిగా మంటలు ఎగిశాయి. దీంతో భయాందోళన చెందిన విద్యార్థినులు హాస్టల్ నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపట్లోనే మంటలు హాస్టల్లో వున్న అన్ని గదులకు వ్యాపించాయి. విద్యార్థినుల పుస్తకాలు, దుస్తులు, ఇతర సామగ్రి కాలిపోయాయి. సమాచారం అందుకున్న నర్సీపట్నం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు.