అనకాపల్లిలో రైతుబజారు ప్రారంభం
ABN , Publish Date - May 26 , 2026 | 11:06 PM
కూరగాయ పంటలను సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు లభించడానికి, పట్టణ వినియోగదారులకు తాజా కూరగాయలను సరసమైన ధరలకు అందించడానికి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ‘రైతుబజారు’ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు.
రైతులకు, వినియోగదారులకు ప్రయోజనం కలుగుందని కలెక్టర్ వెల్లడి
అనకాపల్లి టౌన్, మే 26 (ఆంధ్రజ్యోతి): కూరగాయ పంటలను సాగు చేసే రైతులకు గిట్టుబాటు ధరలు లభించడానికి, పట్టణ వినియోగదారులకు తాజా కూరగాయలను సరసమైన ధరలకు అందించడానికి ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో ‘రైతుబజారు’ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మంగళవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్లతో కలిసి రైతుబజారును ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మార్కెట్ యార్డులో ఖాళీగా వున్న రెండు బ్లాకుల్లో మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతుబజారు నిర్వహణకు అనువుగా రూ.15 లక్షలు వెచ్చించి వసతులు కల్పించినట్టు చెప్పారు. ఎమ్మెల్యే కొణతాల మాట్లాడుతూ, చుట్టుపక్కల మండలాల్లో కూరగాయ పంటలను సాగు చేసే రైతులకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పచ్చికూర రాము, వైస్చైర్మన్ కర్రి వెంకట సత్యనారాయణ, కార్యదర్శి డి.శకుంతల, మార్కెటింగ్ శాఖ ఏడీ అశోక్కుమార్, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడి, కూరగాయలను కొనుగోలు చేశారు. అనకాపల్లి, రావికమతం, కె.కోటపాడు, తదితర మండలాలకు చెందిన రైతులకు ఇక్కడ స్టాల్స్ కేటాయించారు.