డీసీసీబీలో చోరీకి విఫలయత్నం
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:48 AM
మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. లాకర్లు తెరుచుకోకపోవడంతో ఉడాయించారు. దీనికి సంబంధించి ఎస్ఐ వి.సత్యనారాయణ శనివారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.
- లాకర్లు తెరుచుకోకపోవడంతో ఉడాయించిన దొంగలు
- దర్యాప్తు చేస్తున్న పోలీసులు
దేవరాపల్లి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి విఫలయత్నం చేశారు. లాకర్లు తెరుచుకోకపోవడంతో ఉడాయించారు. దీనికి సంబంధించి ఎస్ఐ వి.సత్యనారాయణ శనివారం తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సిబ్బంది శనివారం ఉదయం విధులకు హాజరుకాగా, బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ తెరిచి ఉండడాన్ని గమనించారు. దీనిపై మేనేజర్ పూర్ణచంద్రరావు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని క్రైం సీఐ కె.అప్పలనాయుడు సిబ్బందితో పరిశీలించారు. మేనేజర్ గది వెనుక భాగంలో కిటికీ గ్రిల్ తొలగించి లోపలికి వచ్చి లాకర్లు తెరవడానికి ప్రయత్నించి విఫలమైనట్టు గుర్తించారు. క్లూస్ టీం వేలిముద్రలు సేకరించింది. సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఐ సత్యనారాయణ, కోడూరు ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి నష్టం జరగలేదని, సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేస్తున్నామని సీఐ తెలిపారు. కాగా దొంగలు బ్యాంకు లాకర్ తెరవడానికి ప్రయత్నించినా అలారం మోగలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో మండలంలోని అన్ని బ్యాంకులకు అలారం పనిచేసే విధంగా, భద్రతా చర్యలు చేపట్టాలని పోలీసు శాఖ నుంచి నోటీసులు జారీ చేశామని సీఐ పేర్కొన్నారు.