తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Jan 25 , 2026 | 11:35 PM
మన్యంలో చలి గజగజ వణికిస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి చంపేస్తున్నది.
జి.మాడుగులలో 8.6 డిగ్రీలు నమోదు
పాడేరు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): మన్యంలో చలి గజగజ వణికిస్తున్నది. ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల ప్రభావంతో చలి చంపేస్తున్నది. ఉదయం వేళలో పొగమంచు దట్టంగానే కురుస్తోంది. పాడేరులో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసింది. దీంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు హెడ్లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించారు. అయితే తాజా వాతావరణాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.
కొనసాగుతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఆదివారం జి.మాడుగులలో 8.6, అరకులోయలో 8.8, ముంచంగిపుట్టులో 9.3, జీకేవీధిలో 9.6, పెదబయలులో 10.0, చింతపల్లిలో 10.1, హుకుంపేటలో 10.4, కొయ్యూరులో 15.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.