తగ్గని చలి తీవ్రత
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:37 PM
మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గురువారం జిల్లా కేంద్రం పాడేరులో 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
పాడేరులో 4.1 డిగ్రీలు
వణుకుతున్న మన్యం వాసులు
పాడేరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గురువారం జిల్లా కేంద్రం పాడేరులో 4.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పెదబయలులో 4.8, చింతపల్లిలో 5.0, హుకుంపేటలో 6.2, కొయ్యూరులో 9.7, అనంతగిరిలో 12.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
వణికిస్తున్న చలి
మన్యంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో గిరిజనులు వణికిపోతున్నారు. శీతాకాలంతో పాటు ఉత్తరాది నుంచి శీతలగాలులు, బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంతో ఏజెన్సీలో చలి తీవ్ర ప్రభావం చూపుతున్నది. అలాగే పొగమంచు సైతం దట్టంగా కమ్మేయడంతో ఎదురుగా ఉన్న వ్యక్తులు సైతం కనిపించని విధంగా ఉంటుంది. దీంతో వాహనాలు లైట్లు వేసుకుని రాకపోకలు సాగిస్తున్నాయి. దట్టంగా పొగమంచు కురవడం, మధ్యాహ్నం ఒక మోస్తరుగా మాత్రమే ఎండ కాస్తుండడంతో పగలు, రాత్రి తేడా లేకుండా చలి ప్రభావం చూపుతున్నది. దీంతో ఉన్ని దుస్తులు ధరిస్తూ, చలి మంటలు కాగుతూ జనం చలి నుంచి రక్షణ పొందుతున్నారు.
జి.మాడుగులలో..
జి.మాడుగుల : మండలంలో చలి తీవ్రత కొనసాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల వరకు దట్టంగా పొగమంచు కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలైంది. దీంతో ఏ వీధిలో చూసినా చలి మంటలు కనిపించాయి.