పంటలపై వేసవి ప్రభావం
ABN , Publish Date - May 29 , 2026 | 12:34 AM
వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం సాగులో వున్న పంటలు నీటి ఎద్దడికి గురికాకుండా వుండేందుకు రైతులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ ఇన్చార్జి ఏడీఆర్ డాక్టర్ కె.వి.రమణమూర్తి సూచించారు. ప్రస్తుతం అత్యధిక మండలాల్లో 40 డిగ్రీలకు అటుఇటుగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, అందవల్ల పంటలు బెట్టకు రాకుండా తరచూ నీటి తడులు ఇవ్వాలని చెప్పారు. చెరకు మొక్క/ కార్శి తోటలు, కూరగాయ పంటలను సాగు చేస్తున్న రైతులు... నేలలో తేమను కాపాడుకునేందుకు ఎండు గడ్డి లేదా పంటల అవశేషాలతో మల్చింగ్ చేయాలన్నారు.
నీటి ఎద్దడికి గురికాకుండా చర్యలు
నేలలో తేమను కాపాడుకునేందుకు ఎండు గడ్డి, పంటల వ్యర్థాలు పరచాలి
ఆర్ఏఆర్ఎస్ ఇన్చార్జి ఏడీఆర్ రమణమూర్తి
అనకాపల్లిఅగ్రికల్చర్, మే 28 ఆంధ్రజ్యోతి): వేసవి ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రస్తుతం సాగులో వున్న పంటలు నీటి ఎద్దడికి గురికాకుండా వుండేందుకు రైతులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలని అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్ ఇన్చార్జి ఏడీఆర్ డాక్టర్ కె.వి.రమణమూర్తి సూచించారు. ప్రస్తుతం అత్యధిక మండలాల్లో 40 డిగ్రీలకు అటుఇటుగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని, అందవల్ల పంటలు బెట్టకు రాకుండా తరచూ నీటి తడులు ఇవ్వాలని చెప్పారు. చెరకు మొక్క/ కార్శి తోటలు, కూరగాయ పంటలను సాగు చేస్తున్న రైతులు... నేలలో తేమను కాపాడుకునేందుకు ఎండు గడ్డి లేదా పంటల అవశేషాలతో మల్చింగ్ చేయాలన్నారు. అవసరం మేరకు రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తేలికపాటి నీటి తడులు ఇవ్వాలని సూచించారు. చెరకు సాగు చేసే రైతులు నీరు అందుబాటులో వుండే తరచూ నీటి తడులు ఇవ్వాలని, నీటి సదుపాయం లేకపోతే పంట బెట్టకు రాకుండా వుండేందుకు 10 లీటర్ల నీటికి 25 గ్రాముల యూరియా, 25 గ్రాముల మ్యురేట్ ఆఫ్ పొటాష్లను కలిపి సాయంత్రం ఐదు గంటల తరువాత ఆకులన్నీ తడిచేలా పిచికారీ చేసుకోవాలని ఆయన సూచించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో కూరగాయల పంటలననునన రసం పీల్చు పురుగు ఆశించే అవకాశం ఉన్నందున వీటి నివారణకు డైమిథోయేట్ మందును లీటరు నీటికి రెండు మిల్లీలీటర్లు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.25 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలన్నారు.
ఆలస్యంగా నాటిన కార్శి చేసిన చెరకు తోటలను కొరడా తెగులు ఆశించే అవకాశం ఉందని, ఇది ఆశించిన కొరడాలను కత్తిరించి పొలానికి దూరంగా తీసుకెళ్లా, మంటపెట్టి నిర్మూలించాలని చెప్పారు. వీటి నివారణకు ప్రొపికొనజోల్ మందును లీటరు నీటికి ఒక మిల్లీ లీటరు లేదా ఆజోక్సిస్ర్టోబిన్ టెబుకోనజోల్ ఒక మిల్లీ లీటరు మందును కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. పొలాలకు నీటి సదుపాయం వుంటే.. ముందస్తు ఖరీఫ్ పంటగా నువ్వులను ఈ నెలాఖరులోపు విత్తుకోవాలన్నారు. అధిక దిగుబడినిచ్చే వైఎల్ఎం 66, వైఎల్ఎం 146 వంటి రకాలను ఎంపిక చేసుకొని, కిలో విత్తనాలకు మూడు గ్రాముల చొప్పున మాంకోజెట్తో విత్తనశుద్ధి చేసుకోవాలని సూచించారు. విత్తే ముందు ఆఖరి దుక్కిలో 22 కిలోల యూరియా, 63 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 17 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాలని ఇన్చార్జి ఏడీఆర్ వివరించారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో కాయ ఏర్పడే దశలో ఉన్న వంగ పంటను కాయతొలుచు పురుగు ఆశించే అవకాశం ఉందని, వీటి నివారణకు తొలుత పురుగు ఆశించిన కొమ్మల, చిగుళ్లను కత్తిరించి, అనంతరం లీటరు నీకిటి 0.3 మిల్లీలీటర్ల చొప్పున ఫ్లూబెండమైడ్ కలిపి పిచికారి చేయాలి. స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి వేసవి జల్లులు కురిసిన తరువాత ఖాళీ పొలాల్లో వేసవి దుక్కులు దున్నుకోవాలి. పచ్చి రొట్ట పైరు వేసుకోవడానికి తొలకరి వర్షాలు పడగానే విత్తుకోవాలి. ఆర్ఏఆర్ఎస్లో జనుము విత్తనాలు కిలో రూ.130 అందుబాటులో ఉనన్నాయని, విత్తనాలు కావాల్సిన రైతులు పరిశోధనా స్థానంలో సంప్రదించాలని డాక్టర్ రమణమూర్తి చెప్పారు.